హైదరాబాద్: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరో ఇద్దరు అరెస్టయ్యారు. వికారాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో పనిచేస్తున్న భగవంత్, అతడి తమ్ముడు రవికుమార్ను సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న డాక్యా నాయక్ నుంచి ఏఈ పేపర్ను తన తమ్ముడు రవి కోసం భగవంత్ కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. డాక్యా నాయక్ ఖాతాలను విశ్లేషించగా.. రూ.2లక్షలకు భగవంత్ ఏఈ పేపర్ కొనుగోలు చేసిన విషయం బయటపడినట్లు సిట్ వెల్లడించింది. కాగా ఈ వ్యవహారంలో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో నిందితులకు రూ.33.4 లక్షలు అందినట్లు సిట్ అధికారులు గుర్తించారు.










