విద్యుత్ సంక్షోభానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యుత్ సరఫరా చేసి చిన్న మధ్య తరహా అత్యవసర ఉత్పత్తుల పరిశ్రమలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర విభజన అనంతరం మిగిలిన విద్యుత్తు ఈరోజు విద్యుత్ కోతలకు లోడ్ సెట్టింగ్లకు గురవటానికి విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణ విధానాలను అమలు చేయడమే కారణమని తెలిపారు. ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తిదారులకు లాభాలు కట్టబెట్టడానికే విద్యుత్ రేట్లు పెంచి వినియోగదారులపై భారం మోపుతున్నారని విమర్శించారు. అవసరం కోసం అత్యధిక రేట్లు పెట్టి కొనుగోలు చేసిన విద్యుత్తు భారాన్ని ప్రజలపై మోపవద్దని తెలిపారు. ప్రభుత్వమే సబ్సిడీని భరించాలని ఆయన డిమాండ్ చేశారు.










