Nov 18,2023 07:15

యూదు రాజ్యాన్ని స్థాపించేందుకు ప్రయత్నిస్తున్న ఇజ్రాయిల్‌ వలె హిందూ రాజ్యాన్ని స్థాపించడానికి మైనారిటీల్ని లక్ష్యంగా చేసుకొని, వారిని రెండవ తరగతి పౌరులుగా మార్చడమే హిందూత్వవాదుల దేశీయ విధానం. కాబట్టి, నేడు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న మన పోరాటం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమాఖ్య నిర్మాణం, రాజ్యాంగం, మొత్తంగా ప్రతిపక్షాల ప్రజాస్వామిక హక్కులపై అది చేస్తున్న దాడికి వ్యతిరేకంగా మాత్రమే కాక, ఈ ప్రభుత్వ విదేశాంగ విధానానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం కూడా. దానిని ఆపకుంటే, అది నయా ఫాసిజానికి దారితీసే మార్గంలోకి పోతుంది.

( నిన్నటి తరువాయి )
ఈ విరోధానికి అమెరికా ఎలా స్పందించిందో మనం చూడవచ్చు. ఆ ప్రాంతానికి రెండు వాయు విమాన వాహనాల్ని పంపింది. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ సంఘీభావాన్ని తెలిపేందుకు ఇజ్రాయిల్‌ చేరాడు. ఆసక్తికరంగా, హమాస్‌ను ఎదిరించడానికి అమెరికా కర్తవ్యం గురించి బైడెన్‌ మాట్లాడతాడు కానీ గాజాలో ఇజ్రాయిల్‌ దారుణాల గురించి మాట్లాడడు. నేటికీ బాంబుల దాడిలో వేలాది మంది సాధారణ పాలస్తీనియన్లను చంపే విషయం గురించి అతడు మాట్లాడడు. గాజాలో సగటు వయసు 18, అంటే జనాభాలో 50 శాతం ప్రజలు 18 ఏళ్ల లోపు వారే. కాబట్టి, వారు గాజాపై బాంబు దాడి చేసినప్పుడు మొదటి బాధితులు పిల్లలే. కానీ 11 లక్షల మంది ప్రజలు గాజాను ఖాళీ చేసి, నీరు లేని చిన్న ప్రాంతానికి వెళ్లాలన్న ఇజ్రాయిల్‌ పిలుపు గూర్చి బైడెన్‌ ఏమీ మాట్లాడడు. ఇజ్రాయిల్‌ ఈ ప్రాంతానికి పోలీసుగా నియమితుడైన వారి సైనికుడు కాబట్టి వారేమీ మాట్లాడరు.
          మరోవైపు ఇరాన్‌, పాలస్తీనాకు పూర్తి మద్దతు ఇస్తుంది. లెబనాన్‌లో ఇజ్రాయిల్‌తో పోరాడుతున్న హిజ్బుల్లా ఉంది. ఇజ్రాయిల్‌ సైన్యం ఆక్రమించిన సిరియన్‌ గోలన్‌ హైట్స్‌ అనేది నైరుతి సిరియాలో ఒక ప్రాంతం. అది మరొక వలస. దీనిని కొనసాగించేందుకు అమెరికా వారికి పూర్తిగా మద్దతిస్తుంది. ఇది కొందరు యూదులు, ముస్లింల మధ్య జరిగే పోరాటం కాదు. భారత ప్రధానిగా మొదటిసారి మోడీ ఎందుకు ఇజ్రాయిల్‌కు ఏకపక్షంగా మద్దతు ప్రకటించాడు? తీవ్రవాద దాడిని మేం ఖండించి, తమ మద్దతును ఇజ్రాయిల్‌కు ప్రకటిస్తున్నామని ఆయనన్నాడు. సాధారణంగా మనం ఇజ్రాయిల్‌ ఉనికికి మద్దతిస్తామని ఎప్పుడూ చెప్తాం కానీ పాలస్తీనియన్లు రాజ్యం కోసం హక్కులు పొందాలని కూడా అంటాం. భారతదేశం ఎప్పుడూ ఇదే వైఖరిని తీసుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడది మారింది. నేటి మన భారత ప్రభుత్వం, దాని నాయకుని ఆలోచనలు, నెతన్యాహు మితవాద ప్రభుత్వాన్ని పోలి ఉన్నాయి.
           చాలాకాలం క్రితం, హిందూత్వ పితామహుడు వి.డి.సావర్కర్‌, 1950లో ఇజ్రాయిల్‌ను ప్రశంసించి, వారి పొరుగునున్న ముస్లింలతో వారెలా వ్యవహరిస్తున్నారో మనం వారి నుంచి నేర్చుకోవాలన్నాడు. అంటే జియోనిస్టులు, హిందూత్వ శక్తులు భావజాల పరంగా ఒకే విధంగా ఉన్నట్లు తెలుసుకున్నారు. వాజ్‌పేయి నాయకత్వంలో బిజెపి తొలిసారి అధికారం చేపట్టినప్పుడు వాషింగ్టన్‌, టెల్‌-అవీవ్‌, ఢిల్లీల మధ్య బంధానికి బీజం వేశారు. వాజ్‌పేయి ప్రధాన కార్యదర్శి, జాతీయ భద్రతా సలహాదారైన బ్రిజేష్‌ మిశ్రా అమెరికా వెళ్లి, యూదు మహాసభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, భవిష్యత్తులో భారత్‌-అమెరికా-ఇజ్రాయిల్‌ కూటమిగా ఉంటుందని ప్రకటించారు. భారత దేశానికి, ఇజ్రాయిల్‌ భారీగా మిలిటరీ సామాగ్రిని సమకూర్చే పెద్ద సరఫరాదారుగా మారిందని మనకు తెలుసు. అది, భారత్‌కు అన్ని గూఢచార వ్యవస్థ పరికరాల్ని సరఫరా చేస్తుంది. ఇజ్రాయిల్‌ సమకూర్చిన పెగాసస్‌ సాంకేతికతను, మన ఫోన్లకు హాని కల్గించేందుకు ఉపయోగిస్తున్నారని విన్నాం. కాశ్మీర్‌లో, ఇప్పుడే కాదు, గత 20 ఏళ్ళుగా కాశ్మీర్‌ ప్రజలపై నిఘా ఉంచేందుకు వినియోగించే సాంకేతికతలన్నీ ఇజ్రాయిల్‌ నుండి తెచ్చినవే.
 

                                                కాబట్టి కమ్యూనిస్ట్‌ మ్యానిఫెస్టో మనకేం నేర్పింది ?

ప్రపంచ వ్యాప్తంగా మనం సామ్రాజ్యవాదంపై పోరాడాలి, దాన్ని వ్యతిరేకించాలి, సామ్రాజ్యవాదం వల్ల బాధపడుతున్న వారికి సంఘీభావాన్ని తెలియజేయాలి. అందుకే, మన జాతీయ విముక్తి పోరాట కాలంలో ఇజ్రాయిల్‌ వ్యాపారం మొత్తం పాలస్తీనియన్ల ఖర్చుతో చేసినప్పుడు, రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన వెంటనే గాంధీతో సహా జాతీయోద్యమ నాయకత్వం, పాలస్తీనాకిప్పుడు అన్యాయం జరుగుతుందని అన్నారు. పాలస్తీనియన్ల ఖర్చుతో మీరు యూదులకు న్యాయం చేయలేరు. తమ మాతృభూమిని పొందే హక్కు పాలస్తీనియన్లకు ఉంది. అప్పటి నుండి అదే మన స్థిరమైన విధానం.
        అందువల్ల మోడీ ఏం చేస్తాడనే దానితో నిమిత్తం లేకుండా పాలస్తీనా ప్రజలకు సంఘీభావాన్ని తెలియజేయడమే మన మొదటి కర్తవ్యం. భారతదేశంలో, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్పొరేట్‌ మీడియా వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించడం లేదని మనం అర్థం చేసుకోవాలి. ఇజ్రాయిల్‌కు మాత్రమే మద్దతిచ్చే మీ వైఖరి తప్పు అని తమ ప్రభుత్వాలకు చెప్పే ప్రజలు కూడా అమెరికా, ఐరోపా దేశాల్లో ఉన్నారు. ఇజ్రాయిల్‌ ఆక్రమణకు, దాడికి పాలస్తీనియన్లు చాలా కాలంగా బాధితులుగా ఉంటున్నారు. తమ మనుగడ, విముక్తి కోసం పోరాటం చేస్తున్న బాధితులు పాల్పడే హింసను, వలసవాదులు మరియు అణచివేతదారులు పాల్పడే హింసతో సమానంగా చూడకూడదని మన బూర్జువా మేథావులకు, మీడియాకు చెప్పాలి. హమాస్‌ దాడి సమయంలో అమాయక ప్రజలు, ముఖ్యంగా మహిళల్ని, పిల్లల్ని చంపడాన్ని ఖండిస్తూ, బహిరంగంగా విమర్శించాలి. అంటే దానర్థం, గాజాపై చేసిన దుర్మార్గమైన దాడిలో వందలాది మంది సాధారణ మహిళలు, పిల్లలను చంపడం వంటి దారుణాల పట్ల మనం గుడ్డిగా ఉండాలని కాదు. ఒక పిల్లవాడిపై కాల్పులు జరపడం అనాగరికమనీ, ఒక పిల్లవాడిపై బాంబు విసరడం సరైనదేనని ఎవరైనా చెప్పగలరా? ఈ రెండూ యుద్ధ నేరాలే. కాబట్టి ఆ రెండిటినీ ఖండించాలి.
             అణచివేతకు గురైనప్పటికీ వలస ప్రజలు స్వాతంత్య్రం పొందడంలో విజయం సాధించారు. వీరి వలె కాక పాలస్తీనియన్లు, దురదృష్టవంతులుగా అణచివేతకు గురవు తున్నారని మనం గమనించకుంటే, ఈ విషాద వైరుధ్యాన్ని అర్థం చేసుకోలేం. నేను చెప్పినట్లు, పాలస్తీనా పని 20వ శతాబ్దంలో అసంపూర్తిగా మిగిలి ఉంది. 21వ శతాబ్దంలో మనం ఆ దిశగా పని చేయాల్సి ఉంటుంది. ఇజ్రాయిల్‌కు ఉనికిలో ఉండే హక్కుంది. 75 ఏళ్ళుగా ఉనికిలో ఉంటూనే ఉంది. ఇజ్రాయిల్‌కు ఉనికిలో ఉండే హక్కు లేదంటున్న హమాస్‌తో కూడా మేము ఏకీభవించం. 1967కు ముందున్న హద్దుల్లో వారిని ఉనికిలో ఉండనివ్వండని మేము అంటున్నాం. 1967 యుద్ధం తరువాత ఇజ్రాయిల్‌ ఈ అదనపు భూభాగాలు అన్నిటినీ ఆక్రమించింది. 1967 ముందున్న హద్దులకు తిరిగి వెళ్తే, మిగిలిన ఈ భూభాగాలన్నీ ఎలాంటి అడ్డంకుల్లేకుండా పాలస్తీనా మాతృభూమిగా మారుతాయి అని మేం వారికి చెప్తున్నాం.
           నేడు మన దేశంలోని ఆధిపత్య హిందూత్వ కథనం ప్రకారం, ఇలా మాట్లాడుతున్నందుకు మనపై దాడి జరగొచ్చు. తమను వ్యతిరేకిస్తున్న ఎవరినైనా ఈ ప్రభుత్వం ఏదో విధంగా టెర్రరిస్టులని ముద్ర వేస్తుంది. కాశ్మీర్‌లో ప్రతీ ఒక్కరూ టెర్రరిస్టే. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న జర్నలిస్టులు కూడా టెర్రరిస్టులే. కాబట్టి, వారు మనను టెర్రరిజానికి మద్దతుదార్లని ముద్ర వేయడం సహజం. అయితే, మనం ఇలాంటి వాటికి నిరుత్సాహపడొద్దు. ఎందుకంటే ఈ పోరాటం మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఓ భాగం. విదేశాంగ విధానం కేవలం దేశీయ విధానం పొడిగింపు మాత్రమే. యూదు రాజ్యాన్ని స్థాపించేందుకు ప్రయత్నిస్తున్న ఇజ్రాయిల్‌ వలె హిందూ రాజ్యాన్ని స్థాపించడానికి మైనారిటీల్ని లక్ష్యంగా చేసుకొని, వారిని రెండవ తరగతి పౌరులుగా మార్చడమే హిందూత్వవాదుల దేశీయ విధానం. కాబట్టి, నేడు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న మన పోరాటం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమాఖ్య నిర్మాణం, రాజ్యాంగం, మొత్తంగా ప్రతిపక్షాల ప్రజాస్వామిక హక్కులపై అది చేస్తున్న దాడికి వ్యతిరేకంగా మాత్రమే కాక, ఈ ప్రభుత్వ విదేశాంగ విధానానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం కూడా. దానిని ఆపకుంటే, అది నయా ఫాసిజానికి దారితీసే మార్గంలోకి పోతుంది.
            ఇదే ఇజ్రాయిల్‌లో జరుగుతుంది. విచిత్రమైన విషయం ఏమంటే, హమాస్‌ దాడికి ముందు, నెతన్యాహు ప్రభుత్వం ప్రజల నుంచి భారీగా నిరసనలను ఎదుర్కొంటుంది. నెతన్యాహు, న్యాయ వ్యవస్థను అదుపు చేసేందుకు చట్టాల్ని ఆమోదింపచేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ ప్రజలు పెద్ద ఉద్యమాన్ని నిర్మిస్తున్నారు. ఇక్కడ మన భారత ప్రభుత్వం పార్లమెంట్‌తో పాటు మీడియాను, న్యాయ వ్యవస్థను, ప్రతీదాన్ని అదుపు చేయాలని అనుకుంటుంది. ఇప్పటికే మనకు హిందూత్వ నిరంకుశ పాలన ఉంది. మనం అర్థం చేసుకోవాల్సిందే మంటే, దాన్ని నిరోధించకుండా, ప్రతిఘటించ కుండా అనుమతిస్తే, అది నయా ఫాసిజం రూపానికి దారితీస్తుంది. మనం మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిలబడినప్పుడు, దాని విదేశాంగ విధానానికి కూడా వ్యతిరేకంగా నిలబడుతున్నట్లే లెక్క. ఎందుకంటే అమెరికా, బైడెన్‌లు ఇజ్రాయిల్‌లోని ప్రగతి నిరోధక ప్రభుత్వానికి, సామ్రాజ్య వాదానికి మద్దతు ఇచ్చినట్లే, యునైటెడ్‌ స్టేట్స్‌ మోడీకి, హిందుత్వవాదులకు పూర్తి మద్దతుగా ఉంటుంది. కాబట్టి, మన పోరాటాలు సమగ్రంగా ఉండాలి. అవి విదేశాంగ, దేశీయ విధానాలకు వ్యతిరేకంగా, భారతదేశ లౌకిక, ప్రజాస్వామిక లక్షణాలను మార్చే అన్ని దాడులకు వ్యతిరేకంగా ఉండాలి.  -  మొదటి భాగం లింక్ : https://prajasakti.com/Opposing-imperialism-is-the-first-duty-of-communists

( 'పీపుల్స్‌ డెమోక్రసీ' సౌజన్యంతో )
ప్రకాశ్‌ కరత్‌

prakash karat