Sep 12,2022 10:00
  • టాప్‌ టెన్‌లో ఐదుగురు !
  • అర్హత సాధించిన 40,712 మంది

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జెఇఇ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు-2022 తెలుగు విద్యార్థుల హవా కొనసాగింది. టాప్‌ టెన్‌లో ఐదుగురు తెలుగు విద్యార్థులు ఉన్నారు. పరీక్ష నిర్వహణ సంస్థ ఐఐటీ-ముంబై ఫలితాలతోపాటే తుది ఆన్సర్‌ కీ, మెరిట్‌ లిస్ట్‌ను ఆదివారం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 1,60,038 మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా 1,55,538 మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 40,712 మంది అర్హత సాధించారు. వీరిలో బాలురు 1,21,930 మంది హాజరవ్వగా 34,196 మంది అర్హత సాధించారు. బాలికల్లో 33,608 మందికి 6,516 మంది అర్హత సాధించారు. ముంబయి ఐఐటీ జోన్‌కు చెందిన ఆర్‌కె షిసిర్‌ మొదటి ర్యాంకు సాధించారు. 360 మార్కులకు 314 మార్కులు షిసిర్‌ సాధించారు. రాష్ట్రంలో ప్రకాశం జిల్లాకు చెందిన పొలు లక్ష్మీసాయి లోహిత్‌ రెడ్డి రెండో ర్యాంకు సాధించారు. కృష్ణాజిల్లాకు చెందిన వంగపల్లి సాయి సిద్ధార్థ నాలుగో ర్యాంకు, ఇదే జిల్లాకు చెందిన పొలిశెట్టి కార్తీకేయ ఆరో ర్యాంకు సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్‌కు చెందిన ధీరాజ్‌ కురుకుండ 8వ ర్యాంకు సాధించారు. 10వ ర్యాంకును విశాఖపట్నంకు చెందిన వి.జ్ఞాన మహేష్‌ సాధించారు. ఢిల్లీ జోన్‌కు చెందిన తన్షీకా కబ్ర బాలికల విభాగంలో 277 మార్కులతో మొదటి ర్యాంకు సాధించగా జనరల్‌ విభాగంలో 16వ ర్యాంకు సాధించారు. తన్షీకా నీట్‌లో కూడా మొదటి ర్యాంకును సాధించడం గమనార్హం. మొదటి 100 ర్యాంకులు సాధించిన వారిలో ముంబయి ఐఐటీ జోన్‌ నుంచి 29 మంది, ఢిల్లీ నుంచి 22 మంది, గౌహతి నుంచి ఇద్దరు, కాన్పూరు నుంచి ఒక్కరు, భువనేశ్వర్‌ నుంచి 6గురు, మద్రాస్‌ నుంచి 29 మంది, రూర్కీ నుంచి 11 మంది ఉన్నారు. జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు సాధించిన పొలు లక్ష్మీ సాయి లోహిత్‌ రెడ్డి మద్రాస్‌ జోన్‌లో మొదటి ర్యాంకర్‌గా నిలిచారు. అభ్యర్థుల తమ స్కోర్‌ కార్డులను jవవaసఙ.aష.ఱఅ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఫలితాలను రిజర్వేషన్ల వారీగా ఆయా వర్గాల కోటా ప్రకారం విడుదల చేశారు. జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) సీట్ల కేటాయింపు కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలు కానుంది. 12వ తేదీ నుంచి 'జోసా' రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ, జీఎఫ్టీఐలలో మెరిట్‌, రిజర్వేషన్ల ప్రాతిపదికన ప్రవేశాలు లభిస్తాయి. 23 ఐఐటీలలో 16,598 సీట్లు, 31 ఎన్‌ఐటీలలో 23,994, 26 ఐఐఐటీలలో 7,126, 33 జీఎఫ్టీఐలలో 6,759 సీట్లు ఈసారి భర్తీకి అందుబాటులో ఉన్నట్టు 'జోసా' సీట్ల వివరాలను విడుదల చేసింది. వాటిలోనే మహిళలకు సూపర్‌ న్యూమరరీ కోటా కూడా అమలు కానుంది. ఐఐటీలలో 1,567, ఎన్‌ఐటీలలో 749, ఐఐఐటీలలో 625, జీఎఫ్టీఐలలో 30 సీట్లు మహిళలకు సూపర్‌ న్యూమరరీ కోటా కింద రానున్నాయి. ఆర్కిటెక్చర్‌ కోర్సులకు సంబంధించి అభ్యర్థులు ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌కు 11, 12 తేదీల్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్‌ 14న ఏఏటీ పరీక్షను నిర్వహించి 17న ఫలితాలను విడుదల చేయనున్నారు.