Oct 10,2023 20:20

ప్రజాశక్తి -రాజానగరం (తూర్పుగోదావరి జిల్లా):వచ్చే ఏడాది జనవరి 5, 6, 7 తేదీల్లో 2వ అంతర్జాతీయ తెలుగు మహా సభలను తూర్పు గోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని గైట్‌ కళాశాల ప్రాంగణంలో నిర్వహించనున్నామని ఆంధ్ర సారస్వత పరిషత్‌ అధ్యక్షుడు డాక్టర్‌ గజల్‌ శ్రీనివాస్‌, చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకుడు కెవివి సత్యనారాయణరాజు (చైతన్య రాజు) తెలిపారు. రాజానగరంలోని గైట్‌ కళాశాలలో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు వివరాలను వెల్లడించారు. శ్రీ రాజరాజ నరేంద్ర పట్టాభిషేక సహస్రాబ్ది ఉత్సవాలను ఆంధ్రా సారస్వత పరిషత్‌, చైతన్య విద్యా సంస్థల సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఇందులో భాగంగానే అంతర్జాతీయ తెలుగు మహా సభలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహాసభలకు జాతీయ, అంతర్జాతీయ నాయకులు, పీఠాధిపతులు, చలనచిత్ర ప్రముఖులు పాల్గంటారని అన్నారు. తెలుగు భాషలో సుమారు 25 సాహితీ ప్రక్రియలపై సదస్సులు ఉంటాయన్నారు. 3 వేల మంది కవి సమ్మేళనంలో పాల్గంటారని, 50 దేశాల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారని తెలిపారు. భారతీయ సాంస్కఅతిక ప్రదర్శనలు, కవులు, కళాకారులు, జానపద కళారూపాలు, కళాకారులు, హరిదాసులు, కొమ్ముదాసులు, భాషా పండితులు వస్తారన్నారు. వీటి నిర్వహణకు ఒక ప్రధాన వేదిక, రెండు ఉప వేదికలను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. పుస్తక, కళా ప్రదర్శనలు ఉంటాయన్నారు. సంప్రదాయ కళలతోపాటు సంచార జాతుల కళా ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు. 15 వేల మంది వీక్షించేలా సదుపాయాలు ఏర్పాటు చేశామని తెలిపారు. దూర ప్రాంతాల వారికి వసతి ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అనంతరం మహాసభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో పరిషత్‌ కార్యదర్శి రెడ్డిప్పా ధవేటి, ఉపాధ్యక్షుడు కడివెళ్లవారు ప్రసాద్‌, సమన్వయ కర్త కేశిరాజు రామప్రసాద్‌, గౌరవ సలహాదారులు బాబుశ్రీ, సభ్యులు అడ్డాల వాసుదేవరావు, గైట్‌ కళాశాల ప్రిన్సిపల్‌ టివి.శర్మ పాల్గొన్నారు.