Mar 22,2023 13:21

న్యూఢిల్లీ : అత్యాచారం చేసిన నిందితులకు శిక్ష తగ్గించడాన్ని సవాల్‌ చేస్తూ బిల్కిస్‌బానో దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేందుకు సుప్రీంకోర్టు బుధవారం అంగీకరించింది. ఈ పిటిషన్‌ను విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌, న్యాయమూర్తులు పిఎస్‌ నరసింహ, జెబి పార్దివాలాలతో కూడిన ధర్మాసనం కొత్త బెంచ్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు బిల్కిస్‌బానో తరపు న్యాయవాది శోభాగుప్తా వెల్లడించారు.
కాగా, ఈ కేసులో కొత్త బెంచ్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరముందని శోభాగుప్తా తన వాదనల్ని వినిపించారు. ఈ వాదనల అనంతరం దీనిపై ప్రత్యేక బెంచ్‌ ఏర్పాటు చేస్తాం, ఈరోజు సాయంత్రమే దానిని పరిశీలిస్తామని సిజెఐ డివై చంద్రచూడ్‌ చెప్పారు. బిల్కిస్‌బానో అత్యాచార నిందితులను గతేడాది ఆగస్టు 15వ తేదీ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సమయంలో గుజరాత్‌ ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. నిందితుల విడుదలకు వ్యతిరేకంగా బిల్కిస్‌బానో రివ్యూ పిటిషన్‌ను వేయగా.. దాన్ని గతేడాది డిసెంబర్‌లో సుప్రీం కొట్టేసింది. ఈ విషయంపై ప్రతిపక్షాలు, అధికారపక్షంపై విరుచుకుపడ్డాయి. దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేగింది.