Jan 25,2023 15:16

దుబాయ్ : భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ముగిసిన అనంతరం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. స్వదేశంలో జరిగిన ఈ సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌ (114 రేటింగ్‌ పాయింట్లు) టీమ్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరింది. బౌలింగ్‌ విభాగంలో భారత స్టార్‌ పేసర్‌, హైదరాబాద్‌ కా షాన్‌ మహ్మద్‌ సిరాజ్‌ మియా తొలిసారి వన్డేల్లో వరల్డ్‌ నంబర్‌ వన్‌ బౌలర్‌గా అవతరించాడు. న్యూజిలాండ్‌ సిరీస్‌తో పాటు అంతకుముందు శ్రీలంకతో జరిగిన సిరీస్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబర్చిన సిరాజ్‌.. శ్రీలంక సిరీస్‌లో 3 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు, కివీస్‌తో సిరీస్‌లో 2 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు పడగొట్టి.. మొత్తం 729 రేటింగ్‌ పాయింట్లు తన ఖాతాలో వేసుకుని టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు. సిరాజ్‌ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా ఆటగాడు జోష్‌ హేజిల్‌వుడ్‌ (727) ఉన్నాడు. ట్రెంట్‌ బౌల్ట్‌ (708), మిచెల్‌ స్టార్క్‌ (665), రషీద్‌ ఖాన్‌ (659) వరుసగా 3, 4, 5 స్థానాల్లో నిలిచారు. అలాగే షమీ 11 స్థానాలు ఎగబాకి 32వ స్థానంలో నిలిచాడు.