Jun 13,2023 22:50

జకార్తా: ఇండోనేషియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో తొలిరోజు భారత్‌ఎకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. మంగళవారం జరిగిన పురుషుల, మహిళల సింగిల్స్‌లో భారత షట్లర్ల శుభారంభం చేయగా.. మహిళల, పురుషుల డబుల్స్‌లో భారత జోడీలు పరాజయాన్ని చవిచూశాయి. మహిళల సింగిల్స్‌లో పివి సింధు 21-19, 21-15తో గ్రెగోరియా మరిస్కా(ఇండోనేషియా)పై, పురుషుల సింగిల్స్‌లో 7వ సీడ్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్ రాయ్ 21-16, 21-14తో కెంటో నిషీమోటో(జపాన్‌)పై సునాయాసంగా విజయం సాధించారు. ఇక మహిళల డబుల్స్‌లో త్రీసా జోలీ-గాయత్రీ గోపీచంద్‌ జంట 22-20, 12-21, 16-21తో జపాన్‌కు చెందిన ఇవాంగ-నకనిషి చేతిలో, పురుషుల డబుల్స్‌లో ఎంఆర్‌ అర్జున్‌-ధృవ్‌ కపిల జోడీ 21-12, 6-21, 20-22తో 7వ సీడ్‌ మలేషియా జోడీ చేతిలో పరాజయాన్ని చవిచూశారు. పురుషుల డబుల్స్‌లో 7వ సీడ్‌ సాత్త్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జోడీ 21-12, 21-17తో బల్గేరియాకు చెందిన క్రిస్టో పొపొవ్‌ జోడీపై నెగ్గి రెండోరౌండ్‌లోకి దూసుకెళ్లారు.