
జాతుల మధ్య, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్ల కోసం కుట్రలు చేసే పాలకులు... మతాన్ని దోపుడు కర్రలుగా చేసుకుని, ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉంటే ఏమనుకోవాలీ? అదొక వికలాంగ ప్రభుత్వమనుకోవాలి! మతం వేరు-ప్రజాస్వామ్యం వేరు అని పాలకులు గ్రహించినప్పుడు కదా
మళ్ళీ దేశ ఆరోగ్యం పునరుద్ధరించబడేదీ ?
పశ్చిమ బెంగాల్, ఝర్గ్రాంలో 1940 మే12న జరిగిన బహిరంగసభలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ దేశ ప్రజలనుద్దేశించి చెప్పిన మాటల్ని మనం ప్రస్తుత పరిస్థితుల్లో గుర్తు చేసుకోవాల్సి ఉంది. ''హిందూ మహాసభ తమ సన్యాసులను, సన్యాసినులను తెచ్చి, పెద్ద ఎత్తున రాజకీయాల్లో ప్రవేశపెట్టింది. వారు ఓట్లు అడుగుతూ తిరుగుతున్నారు. వారు కనబడగానే హిందువులంతా ఒక పవిత్ర భావనకు లోనై, శిరస్సు వంచి నిలబడుతున్నారు. హిందూ మహాసభ వారికి బాగా ఉపయోగపడుతూ ఉంది. హిందువులంతా ఈ విషయాన్ని ఖండించాలి. ఆధ్యాత్మికవాదులకు రాజకీయాలతోనూ, ఓట్లతోనూ పనేమిటీ? మత విశ్వాసాలు తెచ్చి రాజకీయాలకు పులమడం వల్ల, ఇప్పుడే కాదు, రాబోయే కాలాలలో కూడా చాలా ప్రమాదాలు జరుగుతాయి. ప్రజలందరూ దీన్ని గుర్తించాలి. అప్రమత్తంగా ఉండాలి. ఏ మతమైనా సరే, దాని పరిధిలో దాన్ని ఉండనివ్వాలి. అతిక్రమిస్తే మాత్రం సహించకూడదు''. దార్శనికుడైన నేతాజీ, ఎనభైయేళ్లకు ముందే నేటి సమకాలీన పరిస్థితిని పసిగట్టారు. ఒకప్పటి హిందూ మహాసభ ఇప్పుడు లేదని అనుకోవద్దు. ఆర్ఎస్ఎస్-బిజెపిలు దాని శాఖలే !
సిఎన్ఎన్-పోల్ ప్రపంచంలోని అత్యంత అవినీతి మయమైన పది రాజకీయ పార్టీల జాబితాను విడుదల చేసింది. అందులో మన దేశంలోని అధికార పార్టీ భారతీయ జనతా పార్టీకి నాలుగోస్థానం లభించింది. దేశంలో బిజెపి వారు చేస్తున్న అరాచక కార్యక్రమాలు రోజూ మీడియాలో చూస్తూనే ఉన్నాం. మీడియాను మోడీ ఎంతగా కొనేసినా ఇంకా నిజాలు నిర్భయంగా వెల్లడిస్తున్న వారు కొంత మందైనా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ అయోధ్యలో అల్లర్లు సృష్టించిన ఏడుగురు బిజెపి కార్యకర్తల్ని సి.సి. ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరు ముస్లిం టోపీలు ధరించి, ముస్లింల వేషధారణలో అయోధ్యలోని మసీదు వెలుపల అభ్యంతరకరమైన పోస్టర్లు అంటించారు. ఖురాన్ ప్రతుల్ని విసిరేశారు. ముస్లింలను నిందిస్తూ, ముస్లింలను దోషులుగా ప్రచారం చేస్తూ ముస్లింల వేషధారణలో అల్లర్లకు పాల్పడింది బిజెపి కార్యకర్తలేనన్నది స్పష్టమైంది.
గడ్డం పెంచుకున్నంత మాత్రాన ఎవరూ రవీంద్రనాథ్ టాగూర్ అయిపోరు. అలాంటప్పుడు మరి ఇతనేనా మన విజయవంతమైన ప్రధానమంత్రీ? సర్దార్ పటేల్ విగ్రహానికి మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. కార్పొరేట్లకు అయిదు లక్షల యాభై అయిదు వేల కోట్లు రుణమాఫీ చేశాడు. ప్రధాని తన విదేశీ యాత్రలకు 25 వేల కోట్లు, బిజెపి పార్టీ ఆఫీసుకి రూ.350 కోట్లూ, తమ పార్టీ వ్యాపార ప్రకటనలకు 500 కోట్లు, ప్రధాని సెక్యూరిటీకి 591 కోట్ల 30 లక్షల ఖర్చు వస్తూ ఉంది. గడచిన ఐదేళ్లలో కుంభమేళాలకు 500 కోట్లు, ట్రంప్కు నమస్కారం చెప్పడానికి వందకోట్లు ఖర్చు చేశాడు. ఇతని వల్లనే కదా ద్రవ్యోల్బణం పెరిగిందీ? ఇతని వల్లనే కదా పెట్రోల్, డీజిల్, గ్యాసు సిలిండర్ ధరలు ఊహించలేనంతగా పెరిగాయీ? గడచిన 30-40 సంవత్సరాలలో ఏనాడూ ఇంతమంది సైనికులు చనిపోలేదు. ఈయన గారి అధ్వాన్నపు పాలన ఎలా ఉందో చెప్పడానికి ఇంకా ఎన్ని ఉదాహరణలు కావాలీ? అంటూ ప్రతిపక్ష నేతలు పార్లమెంట్లోనే అనేకసార్లు గగ్గోలు పెట్టారు. సంసద్ టి.వి, ఇతర జాతీయ టెలివిజన్ చానళ్ళ ద్వారా దేశ ప్రజలు అన్నీ గమనిస్తూ వచ్చారు. అక్కడ ప్రతిపక్షాలు తమ 'మన్ కి బాత్' గొంతెత్తి చెపుతున్నాయని అనుకున్నారు. ప్రత్యక్ష ప్రసారం చేసింది సంసద్ టి.వి.యే గనక, అది అధికార ప్రకటననే-అని దేశ ప్రజలు భావించారు!
కర్ణాటకలో విద్వేష ప్రసంగాలకు బిజెపి నాయకులు ఆజ్యం పోస్తున్నారు. కర్ణాటక బిజెపి చీఫ్ నళిన్ కుమార్ కాతిల్ - ''టిప్పు సుల్తాన్ అభిమానులు ఈ దేశంలో ఉండటానికి వీలులేదు. వారిని వెంటాడి వేటాడి చంపేయండి. లేదా అడవి ప్రాంతాలకు పారద్రోలండి. మనం హిందువులం శ్రీరాముడి భక్తులం!'' అంటూ కర్ణాటకలోని కొప్పాల్ జిల్లాలోని యెల్బుర్గాలో ఈ విద్వేష ప్రసంగం చేశాడు. ఫలితంగా కర్ణాటక ప్రజలు తమ తీర్పునిచ్చారు. ఎవరిని పారదోలాలన్నది బహుశా వారికి తెలిసినట్టుంది! ఆంగ్లేయులను ఎదిరించి పోట్లాడిన భారతీయ పాలకుడు టిప్పు సుల్తాన్ను వీరు దేశద్రోహి అని అంటారు. ఎందుకూ? అంటే - అతను ముస్లిం రాజు కాబట్టి! ఆంగ్లేయుల బూట్లు నాకి క్షమాభిక్ష అడుక్కున్న సావర్కర్ వీరి దృష్టిలో గొప్ప దేశభక్తుడు. ఎందుకూ? హిందూ మహాసభ / ఆరెస్సెస్ / బిజెపి ల సభ్యుడు గనక! గాంధీని హత్య చేసిన గాడ్సేకు వెనక ఉన్నది సావర్కరేనన్న విషయం కావాలనే దాచిపెడతారు.
ఉత్తర ప్రదేశ్ అమేథికి చెందిన మహమ్మద్ ఆరిఫ్ కొన్నేళ్ళ క్రితం తన పొలంలో గాయపడి పడిపోయిన 'సారస్' రకం కొంగకు చిన్నపాటి కట్టుగట్టి వైద్యం చేసి కాపాడాడు. అలా ఆ కొంగ అతని దగ్గరే ఉండిపోయింది. అటవీశాఖ అధికారులు వచ్చి ఆ కొంగను స్వాధీనం చేసుకుని సమస్పూర్ పక్షుల సంరక్షణ కేంద్రానికి తరలించారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆరిఫ్పై అధికారులు కేసు నమోదు చేయడం వివాదాస్పదమైంది. పక్షి ప్రాణాలు కాపాడినందుకు బిజెపి ప్రభుత్వం ఆరిఫ్పై కేసు పెట్టింది. కారణం మరేమీలేదు, అతను ముస్లిం కావడమే. అలా కేసులు పెడితే పెద్ద పెద్ద వాళ్ళ మీదే పెట్టాలి. ప్రధాని మోడీ తన నివాసంలో నెమళ్ళు పెంచుకుంటే కేసు ఉండాలి కదా? అలాగే యూపీ ముఖ్యమంత్రి యోగి తన కార్యాలయంలో పనిచేస్తూ ఉండగా, ఆయన ఒళ్ళో బుల్లి కోతి వచ్చి కూర్చుంటుంది. ఆయన దాన్ని ఆడిస్తూ ఉంటాడు. ఆయన మీద కేసు ఉండాలి కదా? వీళ్ళు ఆ జంతువుల / పక్షుల గాయాలు మాన్పలేదు. ఆరోగ్యంగా ఉన్నవాటినే పెంచుకుని ఆడుకుంటున్నారు. అటవీ చట్టం ప్రకారం అడవి జంతువుల్ని బలవంతంగా ఇంట్లో కట్టి పడేసుకోవడం నేరం. ప్రాణాలు కాపాడి, ఆహారం పెట్టినందుకు ఓ కొంగ ముస్లిం యువకుడికి దగ్గరయ్యింది. అంతే - అది అతని పెంపుడు పక్షి కాదు. బలవంతంగా దాన్ని తన దగ్గర ఉంచుకోలేదు. విషయం క్షుణ్ణంగా పరిశీలించక, దురుద్దేశంతో కక్షపూరితంగా కేసులు పెట్టడం నేటి బిజెపి ప్రభుత్వానికి అలవాటైపోయింది.
భారత ప్రధాని అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు ''మై యుద్ధ్ కి దేశ్ సే నహీు ఆయా/ మై బుద్ధ్ కి దేశ్ సే ఆయా హూు'' అని గొప్పగా చెప్పుకున్నాడు. అంటే నేను యుద్ధాలు చేసే దేశం నుండి రాలేదు. నేను బుద్ధుడు పుట్టి పెరిగిన దేశం నుండి వచ్చాను-అని అర్థం! అలా చెప్పుకోవడం బాగుంది. కానీ, నేను ముఖం నుండి మనుషులు పుట్టే దేశం నుండి వచ్చాను. భుజాల నుండి మనుషులు పుట్టే దేశం నుండి వచ్చాను-అని ఎందుకు చెప్పుకోలేదూ? వినాయకుడికి ప్లాస్టిక్ సర్జరీ జరిగిన దేశం నుండి వచ్చాను అని కదా చెప్పుకోవాలి? మరి అలా ఎందుకు చెప్పుకోలేకపోయారూ? అలా చెప్పుకుంటే, ప్రపంచ పౌరులు నవ్వుకుంటారని భయం. ఒకప్పుడు గుజరాత్లో ఇప్పుడు మళ్ళీ మణిపూర్లో నరమేధం జరుగుతూ ఉంటే దేశ ప్రధాని మౌనవ్రతం చేపట్టడమేమిటీ? దేశ ప్రజలకు భరోసా ఇచ్చి, ధైర్యం చెప్పి, సమస్యను పరిష్కరించాల్సింది ఎవరూ? గత్యంతరం లేక నిండు పార్లమెంట్లో విపక్ష నేత-'తమరు దేశభక్తులు కారు. దేశద్రోహులు' అని గొంతెత్తి అరవాల్సిన పరిస్థితి వచ్చింది కదా?
''డెమోక్రసీ హమారీ డిఎన్ఏ మై హై'' అని దేశ ప్రధాని అమెరికా వైట్హౌస్లో గొంతు చించుకుని వచ్చారు. అసలు ఆయనకు డెమాక్రసీ అనే పదం ఉచ్ఛరించే అర్హత ఉందా? అని దేశ పౌరులు ఆలోచనలో పడ్డారు. వాస్తవాల్ని తొక్కిపెట్టి గాలి కబుర్లు చెప్పేవారిని ఈ ఆధునిక-ఆలోచనా యుగంలోని జనం విశ్వసించరు. మణిపూర్లో ఇద్దరు కుకీ తెగ మహిళల్ని నగంగా ఊరేగించిన ఘటనపై అగ్రరాజ్యం అమెరికా ఆగ్రహించింది. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపింది. మానవ హక్కుల్ని కాపాడాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్ని కోరింది. ''మణిపూర్ మె భారత్ మాతాకి హత్యా హుయీ హై'' అని విపక్షనేత గొంతు చించుకుని అరిచిన అరుపు పార్లమెంట్లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ప్రతిధ్వనించింది. జాతుల మధ్య, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్ల కోసం కుట్రలు చేసే పాలకులు మతాన్ని దోపుడు కర్రలుగా చేసుకుని, ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉంటే ఏమనుకోవాలీ? అదొక వికలాంగ ప్రభుత్వమనుకోవాలి! మతం వేరు-ప్రజాస్వామ్యం వేరు అని పాలకులు గ్రహించినప్పుడు కదా మళ్ళీ దేశ ఆరోగ్యం పునరుద్ధరించబడేదీ? రాహుల్ గాంధీ ఆక్రోశాన్ని పార్లమెంట్ రికార్డుల్లోంచి తొలగించుకోగలరు. కానీ, ప్రపంచ పౌరుల మనుసుల్లోంచి తొలగించలేరు.
( వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్ )
డా|| దేవరాజు మహారాజు