
మోడీ, అమిత్ షా బృందం ఎపిలో తెరవెనక నుంచి, తెలంగాణలో నేరుగా రాజకీయ భాగోతం నడిపిస్తున్నారు. కాంగ్రెస్కు ఎపిలో మళ్లీ వూపిరిపోయడానికి ప్రయత్నిస్తుండడమే గాక తెలంగాణలో కొంత పట్టువున్నా అంతర్గత కలహాలతో రగిలిపోతున్నారు. జనసేన ఎపిలో మాత్రం బిజెపితో కలసి వస్తుందని అంటుంటే తెలంగాణలో పొత్తు వుండదన్నట్టే సూచిస్తున్నారు. అయితే అక్కడ టిడిపి, జనసేన విడిగా పోటీ చేయడం బిజెపికే మేలని కూడా విశ్లేషిస్తున్నారు. ఎపిలో పొత్తులకు తెలంగాణ పోటీ బేరసారాల అస్త్త్రంగా వుంటుందని భావిస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలి రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వీటివల్ల వెంటనే మౌలికంగా ఏదో జరిగిపోతుందని కాదు గాని రాజకీయ శక్తులు, వ్యక్తులు వ్యవస్థల పాత్ర మారిపోతున్నది. కలయికలు, కలహాలు, విడిపోవడాలు, విలీనాలు ఇవన్నిటి వెనక ఒక అప్రకటిత అవగాహన ఏదో వున్నట్టు తోస్తుంది. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో జరిగే పరిణామాల మధ్య కూడా సంబంధం ఏదో గోచరిస్తుంది. కులవారీ సమీకరణలు, సమావేశాలు వేగం పుంజుకుంటున్నాయి. ఇవి మీడియాలోనూ ప్రతిబింబిస్తున్నాయి. నీరు కన్నా రక్తం చిక్కన అన్నట్టు తెలుగువారు రెండు రాష్ట్రాలయినప్పటికీ రాజకీయ గమనంలో కొన్ని ఉమ్మడి అంశాలు ప్రస్ఫుటమవుతున్నాయి. పాలక పార్టీలకు సంబంధించినంతవరకూ అధికారం తప్ప మిగిలినవన్నీ ద్వితీయ ప్రాధాన్యతే వహిస్తాయి గనక ఏతావాతా ఏదైనా జరగొచ్చనే భావం రానురానూ ప్రజలలో పెరిగిపోతున్నది. కాకుంటే పైకి కనిపించని రాజకీయాంశాలేమిటి, వాటి ప్రభావమేమిటి అన్న ఆసక్తి, ఒక అస్పష్ట వాతావరణం పెంచుతున్నది.
బిఆర్ఎస్ అవతరణ
ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన మార్పులలో మొదటిది టిఆర్ఎస్ బిఆర్ఎస్గా అవతారమెత్తడం. తెలంగాణ అన్న మాటతో సాగిన పదేళ్ల రాజకీయం, ఆ పేరుతో ఏర్పడిన పార్టీ ఇరవయ్యేళ్ల గమనం ముగిసి జాతీయ పార్టీగా మారింది. బిజెపి నిరంకుశత్వాన్ని, మతతత్వ రాజకీయాలను, రాష్ట్రాలపై దాడులను ఎదుర్కొవడానికి జాతీయపాత్ర పోషిస్తామని కెసిఆర్ అక్టోబరులోనే ప్రకటించారు. లౌకిక పార్టీలు ఆ నిర్ణయాన్ని హర్షించాయి కూడా. ఇదే సమయంలో మునుగోడు ఉపఎన్నిక విజయం దానికి మరింత వూపు నిచ్చింది. ఆ ఎన్నికల నాటికే టిఆర్ఎస్ నేతలు ఢిల్లీ లిక్కర్ స్కాంలో చిక్కుకున్నారనే కథనాలు వెలువడుతూ వచ్చాయి. పోలింగ్కు ముందు చివరి వారంలో ఆపరేషన్ ఫాంహౌస్ దుమారం రేపింది. సిబిఐ, ఇడి లిక్కర్ స్కాం పేరిట రంగ ప్రవేశం చేశాయి. ఇందులోనూ రెండు రాష్ట్రాల నేతల పేర్లు వచ్చాయి.అయితే ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రం తాము బిఆర్ఎస్ విషయంలో వెనక్కు తగ్గేదిలేదంటూ ముందడుగు వేశారు. ఢిల్లీలో కార్యాలయం కూడా ప్రారంభించి యుపి మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్యాదవ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, వివిధ రాష్ట్రాల రైతు నాయకులతో చర్చలు జరిపారు. పంజాబ్ కిసాన్ నేతను తమ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడుగా ప్రకటించారు. వచ్చేది రైతు ప్రభుత్వమన్నట్టు ప్రకటిస్తున్నారు. ఈ సమయంలోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణా హిందీని గేళి చేస్తూ మాట్లాడ్డం కెసిఆర్ భవిష్యత్ ప్రసంగాలనుద్దేశించిందే. కర్ణాటక ఎన్నికలు మూడు మాసాలలోనే వస్తాయి గనక అక్కడ ఇదివరకటి నిజాం సంస్థానభాగాలలో పోటీ చేస్తారంటున్నారు. కుమారస్వామికి కూడా అన్ని విధాల సహాయం అవసరం గనక , ఈ ప్రాంతాలలో బలం కూడా అంతంతే గనక కెసిఆర్ను మరింతగా ఆహ్వానిస్తున్నారు. మహారాష్ట్ర, చత్తీస్ఘర్, ఒరిస్సా, తమిళనాడులపైన కూడా ఆ విధమైన ఆశలున్నాయి. ఎపిది మరో ప్రత్యేకత. గత పరిణామాలు, ఉద్యమ కాలపు ఉద్రేకాల రీత్యా బిఆర్ఎస్ ఎపిలో పెద్ద ప్రభావం చూపే అవకాశం వుండదు. కానీ సోదర రాష్ట్రంలో పోటీ చేయకపోతే తమ జాతీయ పార్టీకి అర్థం వుండదని ఆ నాయకులకు తెలుసు. అందుకే వారికి సన్నిహితులైన కొందరు ఫ్లెక్సీలు పెడుతున్నారు. రాజకీయంగా కూడా వైఎస్ఆర్సిపి, ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోడీకి బిజెపికి సన్నిహితులుగా పేరొందారు. ఆ మాట కెసిఆర్ ఎప్పుడూ గుర్తు చేస్తుంటారు కూడా. చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం కూడా కెసిఆర్కు వ్యతిరేకంగానే నిలబడిన పరిస్థితి గానీ బిజెపికి దగ్గరగా వెళ్లాలని చూస్తున్నారు. ఈ సమయంలో చంద్రబాబు నాయుడు మరోసారి తెలంగాణలో పునర్వైభవం తెస్తానంటూ వచ్చే వారం ఖమ్మంలో సభ పెడుతున్నారు. మోడీ, అమిత్ షా బృందం ఎపిలో తెరవెనక నుంచి, తెలంగాణలో నేరుగా రాజకీయ భాగోతం నడిపిస్తున్నారు. కాంగ్రెస్కు ఎపిలో మళ్లీ వూపిరిపోయడానికి ప్రయత్నిస్తుండడమే గాక తెలంగాణలో కొంత పట్టువున్నా అంతర్గత కలహాలతో రగిలిపోతున్నారు. జనసేన ఎపిలో మాత్రం బిజెపితో కలసి వస్తుందని అంటుంటే తెలంగాణలో పొత్తు వుండదన్నట్టే సూచిస్తున్నారు. అయితే అక్కడ టిడిపి, జనసేన విడిగా పోటీ చేయడం బిజెపికే మేలని కూడా విశ్లేషిస్తున్నారు. ఎపిలో పొత్తులకు తెలంగాణ పోటీ బేరసారాల అస్త్త్రంగా వుంటుందని భావిస్తున్నారు. వామపక్షాలు తెలంగాణలో రాజకీయంగా బిఆర్ఎస్తో కలసి బిజెపిని వ్యతిరేకిస్తున్నా ఎన్నికల నాటికి గాని పొత్తు గురించి చెప్పడానికి లేదని సిపిఎం అంటున్నది. సిపిఐ ఎపిలో టిడిపితో కలసి పాల్గొంటూ వుంటే తెలంగాణలో ప్రతి సందర్బంలోనూ బిఆర్ఎస్కు మద్దతులో ముందుంటున్నది. బిజెపిని టిఆర్ఎస్, ఉభయ కమ్యూనిస్టులు కలసి ఎదుర్కొంటున్న తెలంగాణా వాతావరణం, మూడు ప్రాంతీయ పార్టీలూ బిజెపికి అనుకూలంగా వుంటున్న ఎపి రాజకీయాలు భిన్నంగా కనిపిస్తున్నాయి.
విభజన సమస్యలు, వివాదాలు
ఈ పరిస్థితి బిఆర్ఎస్, వైసీపీల మధ్య, ఎపి, తెలంగాణాల మధ్య కూడా వైరుధ్యాలను పెంచుతున్నది. జగన్ అధికారంలోకి వచ్చిన కొత్తలో కెసిఆర్, ఆయన స్నేహితులుగా వుంటారని భావించేవారు. విభజన సమస్యల పరిష్కారమే గాక కొత్త ప్రతిపాదనలు కూడా అప్పట్లో వినిపించాయి. అదంతా ఆచరణలో అక్కరకు వచ్చింది లేదు. ప్రాజెక్టులపై ఆయన ప్రకటనలు ప్రభుత్వం ఆమోదించలేదు. ప్రతిపక్షాలూ విమర్శించాయి. వ్యక్తిగత సంబంధాలు, పరస్పర ప్రశంసలు వున్నా విభజన సమస్యలపై వివాదాలే పెరిగాయి. మొదట్లో కెసిఆర్ కేంద్రంతో మంచిగా వున్న కాలంలో కూడా పరిష్కారం దిశలో అడుగైనా పడలేదు. ఇక ఇప్పుడు వైరుధ్యాలు మరీ పెరిగాక జరిగిన పలు సమావేశాలు వృథా అయ్యాయి. పరిష్కారానికి తెలంగాణ అడ్డుపడుతున్నదంటూ హఠాత్తుగా జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసు వేసింది. అయితే అందులో కేంద్రం బాధ్యతను కనీసంగా ప్రస్తావించకపోవడం యాధృచ్చికం కాదు. మోడీ ప్రభుత్వ నిర్దేశంతోనే సుప్రీంలో కేసు వేశారనే అభిప్రాయం వుంది. దానితోపాటే విభజన చట్టం సక్రమంగా ఆమోదించలేదనే ఆనాటి కేసులు కూడా ముందుకొచ్చాయి. ఆ కేసు వేసిన వారిలో ఒకరైన మాజీ ఎంపి ఉండవల్లి తనను ఎవరూ బలపర్చలేదని ఆరోపిస్తూ ప్రభుత్వ వైఖరినీ తప్పు పట్టారు. దాన్ని అవకాశంగా తీసుకుని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అవకాశమే వుంటే రెండు రాష్ట్రాల పునరేకీకరణ కోరతామనడం, దానిపై తెలంగాణ నేతలు విరుచుకుపడటం టీ కప్పులో తుపానులా తయారైంది. తమాషా ఏమంటే కెసిఆర్, జగన్ కలసి ఈ ప్రహసనం నడిపిస్తున్నారనే కథనాలు మీడియాలో వచ్చాయి గాని కేంద్రం ప్రధాన పాత్ర బాధ్యత మరుగున పడిపోయింది. ఈ కేసును కూడా సుప్రీం విచారణకు స్వీకరించి కేంద్రానికి కూడా నోటీసు ఇవ్వాలని ఆదేశించింది.ఈ తతంగంలో మూడో కోణం థర్డ్ డైమెన్షన్ జగన్ సోదరి షర్మిల పార్టీ పెట్టి నిత్యం కెసిఆర్ కుటుంబంపైన కేంద్రీకరించి దాడి చేయడం, ఆమెకు పోలీసులు అవరోధాలు కలిగించడం, ఇటీవల ఆమెను కారుతో సహా తరలించడం దీనికి పరాకాష్ట. వైఎస్ విజయమ్మ కూడా ఆమెతో వుండటం, ఆంధ్రా నేతలు, సమైక్య వాదులు మళ్లీ కుట్రలు మొదలెట్టారని శాసనమండలి ఛైౖర్మన్ తో మొదలెట్టి అప్పటి టిఆర్ఎస్ నాయకులందరూ దాడి చేశారు. ఈ నేపథ్యంలో జి20 సమావేశంలో ప్రధాని మోడీ ఆ ఘటన గురించి జగన్తో ప్రస్తావించారని, తర్వాత ఆమెకు ఫోన్ చేశారని కథనాలు వచ్చాయి. ఆయన ఫోన్ చేయలేదని బిజెపి కీలకనేతలు ఈ వ్యాసకర్తతో చెప్పారు గాని బహిరంగంగా ఖండించలేదు. షర్మిల ఆ విషయమై మాట్లాడబోనన్నారు. ఈ విధంగా తెలుగునాట ప్రాంతీయ పార్టీలన్నిటితోనూ మోడీ నాయకత్వం దాగుడు మూతలాడుతున్నది. వారి రాష్ట్ర నాయకులు మేము అమరావతికే మద్దతు అంటున్నా కేంద్రం ఒక్కసారి కూడా స్పష్టత ఇవ్వడం లేదు. ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు సమావేశాలలో కూడా రాజధాని ప్రస్తావనపై సాంకేతిక సమాధానాలు ఇవ్వడం తప్ప తమ విధానం చెప్పలేదు. అయితే టిడిపి నాయకులు మాత్రం అనవసరంగా ఏదో స్పష్టత ఇచ్చినట్టు ప్రచారం చేస్తున్నారు.మరోవంక ప్రధాని పర్యటనతో మొదలుపెట్టి వరుసగా విశాఖలోనే జాతీయ కార్యక్రమాలు నిర్వహిస్తున్న కేంద్రం విశాఖ ఉక్కును మాత్రం అమ్మి తీరతామంటున్నది. పాలక వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ తమలో తాము ఆరోపణలు చేసుకోవడం తప్ప కేంద్రంపై ఉమ్మడిగా ఒత్తిడి తేవడమనే ప్రసక్తి లేకుండా పోయింది. అంతేగాక ఉద్యోగుల జీతభత్యాలు పెన్షన్, ఔట్సోర్సింగ్ సిబ్బంది తొలగింపు జీవోలు వంటి అంశాలన్నీ ప్రధాన ప్రతిపక్షానికి అప్రధానంగా వున్నాయి. మొత్తంపైన రెండు పార్టీలూ రాజకీయ సర్వేల్లో మేమే గెలుస్తామన్న ప్రకటనలోనే మునిగితేలుతున్నాయి. తమ నాయకులు హుషారుగా వుండాలని హెచ్చరిస్తున్నాయి. లేకుంటే అభ్యర్థులను మారుస్తామని బెదిరిస్తున్నాయి.
బిజెపి చెలగాటం
ముందస్తు ఎన్నికలు వస్తాయనేది రెండు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు మరో ప్రధాన ప్రచారంగా వుంది .రెండు పాలకపార్టీలూ ఆ అవకాశం లేదని గట్టిగా ఖండిస్తున్నా ప్రతిపక్షాలూ, కొన్ని మీడియాలు మాత్రం చెబుతూనే వున్నాయి. తాము ఎపికే పరిమితమనీ, బిఆర్ఎస్ మద్దతు కోరితే అప్పుడు ఆలోచిస్తామని సజ్జల చెప్పారు. అయితే ఆ అవకాశం వుండదనేది స్పష్టమే. కానీ ఎపిలో బిఆర్ఎస్ కార్యాలయం ప్రారంభిస్తారనీ, కెసి ఆర్ సభ వుంటుందనీ కూడా కథనాలు వస్తున్నాయి. జాతీయ పార్టీగా మారారు గనక గతంలో వలె ఆంధ్ర తెలంగాణ భాషలో మాట్లాడటం కుదరదనీ, సరిగా వుండదనీ కూడా అభిప్రాయం వుంది. లిక్కర్ స్కాం వంటి వాటిలో వైసీపీ నేతల కుటుంబ సంబంధాలు కొన్ని వినిపిస్తే .. ఆపరేషన్ ఫాంహౌస్లో వైసీపీ అసమ్మతి ఎంపి పేరు వచ్చింది.చంద్రబాబు నాయుడు ఐఎస్బి 20 వ వార్షికోత్సవ కొనసాగింపు సభలో ప్రత్యేకంగా మాట్లాడుతూ సైబరాబాద్ అభివృద్ది, విజన్ 2020, దాన్ని రూపొందించిన మెకన్సీ( ఈ స్కూలు వారిదే) మొత్తం 2004 నాటి ఎజెండా ఏకరువు పెట్టారు. అమరావతి ఆలస్యంలో తన పాత్రను దాటవేసి అది హైదరాబాద్లా పెరిగి వుండేదనే పాత కథే పునశ్చరణ చేశారు. వీటన్నిటిలోనూ రాజకీయ కోణాలు దాచేస్తే దాగేవి కావు. బిజెపి తన ప్రయోజనాల కోసం రెండు రాష్ట్రాలలో తలోవిధంగా చెలగాటమాడుతున్నది గనక బాహాటంగానూ, లోపాయికారిగానూ కనిపించే ఈ పొలీస్ పొలిటికో లీగల్ అంశాలు ఎలా పరిణమిస్తాయో చూడాల్సిందే.
తెలకపల్లి రవి