Jul 19,2022 20:52

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఆల్‌ ఇండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎఐఆర్‌టిడబ్ల్యుఎఫ్‌) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా నేపాల్‌దేవ్‌ భట్టాచార్య, ఆర్‌.లక్ష్మయ్య ఎన్నికయ్యారు. ఈ నెల 16 నుండి 18 వరకు హర్యానాలోని హిస్సార్‌లో ఎఐఆర్‌టిడబ్ల్యుఎఫ్‌ 11వ జాతీయ మహాసభలు జరిగాయి. ఈ మహాసభ 135 మందితో జనరల్‌ కౌన్సిల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అందులో 110 మంది వర్కింగ్‌ కమిటీ సభ్యులుకాగా, 35 మంది ఆఫీస్‌ బేరర్లుగా ఎన్నికయ్యారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కె.కె.దివాకరన్‌, కోశాధికారిగా కె.హరికృష్ణన్‌, ఆఫీస్‌ బేరర్లుగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి ముజఫర్‌ అహ్మద్‌, తెలంగాణ నుంచి విఎస్‌ రావు ఎన్నికయ్యారు. వర్కింగ్‌ కమిటీ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి సిహెచ్‌ సుందరయ్య, ఎన్‌.శివాజి, జి. శ్రీనివాసులు, సురేష్‌, ప్రభాకర్‌, తెలంగాణ నుంచి పి. శ్రీకాంత్‌, పిఆర్‌ రెడ్డి, జె. ఉపేందర్‌, కె. మల్లేశం ఎన్నికయ్యారు. జనరల్‌ కౌన్సిల్‌ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి సత్యనారాయణ, ఎం.పోలినాయుడు, కె. దుర్గారావు, ఎస్‌కె రఫీ, వెంకటేశ్వర్లు, ఎస్‌కె రియాజ్‌, ఎస్‌కె. జిలాని, తెలంగాణ నుంచి సిహెచ్‌ రామచందర్‌, మహబూబ్‌ పాషా ఎన్నికయ్యారు.
సామాజిక భద్రతా చట్టం తీసుకురావాలి
అసంఘటిత రోడ్డు రవాణా కార్మికులకు సామాజిక భద్రతా చట్టాన్ని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ మహాసభ ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. మూడు రోజుల చర్చల ముగింపు సందర్భంగా ప్రధాన కార్యదర్శి కెకె దివాకరన్‌ ప్రతినిధులు లేవనెత్తిన అంశాలపై సమాధానమిచ్చారు. ప్రధాన కార్యదర్శి నివేదికను మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రవాణారంగ పరిశ్రమను పరిరక్షించడంతోపాటు కార్మికుల సంక్షేమం కోసం రాబోయే మూడేళ్లకు రోడ్‌ మ్యాప్‌ను ఖరారు చేసింది.