Nov 17,2023 11:49

పటాన్‌ చెరు (సంగారెడ్డి) : మహిపాల్‌ రెడ్డి అనవసరంగా పోలీసులను తమపై ఊసిగొల్పితే సహించేది లేదని, 'మహిపాల్‌ రెడ్డి నీ అంతు చూస్తా' అని బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి నందీశ్వర్‌ గౌడ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌ చెరు పట్టణంలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి నందీశ్వర్‌ గౌడ్‌ నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ.... బిజెపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చాట్‌ పూజకు పోలీసులు అనుమతిని ఇవ్వలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బిజెపి చేసే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి అడ్డుకునేందుకు పోలీసులను ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేందుకు పోలీస్‌ వ్యవస్థను అడ్డుపెట్టుకుని అపహాస్యం చేస్తున్నారన్నారు. పటాన్‌ చెరులో బిఆర్‌ఎస్‌ అభ్యర్థి గూడెం మహిపాల్‌ రెడ్డికి ఎన్నికలలో పంచేందుకు 30 కోట్ల రూపాయలు డంప్‌ చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ఇదే మైత్రిలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి ఛాట్‌ పూజకు ఎలా అనుమతినిచ్చారని... తమకెందుకు ఇవ్వరని నిప్పులు చెరిగారు. పోలీసులు బిఆర్‌ఎస్‌ కు తొత్తులుగా పనిచేస్తున్నారని విమర్శించారు. సిఐని వెంటనే ఇక్కడ నుంచి మార్చాలని.. వారిపై ఉన్నతాధికారులకు, గవర్నర్‌ కు ఫిర్యాదు చేశామని నందీశ్వర్‌ గౌడ్‌ అన్నారు. బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి గూడెం మహిపాల్‌ రెడ్డి ప్రజల నుంచి దోచుకున్న డబ్బులతో పోలీసులను, వ్యవస్థ లనూ మేనేజ్‌ చేద్దామనుకోవటం సమంజసం కాదన్నారు. బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మహిపాల్‌ రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టింది తానేనని నందీశ్వర్‌ గౌడ్‌ అన్నారు. ఈ సారి రూ.100 కోట్లు పెట్టినా మహిపాల్‌ రెడ్డి గెలవలేడని సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయానికి, అధర్మానికి జరుగుతున్న సంగ్రామం ఇది అని అన్నారు. సుప్రీం కోర్టు లో మహిపాల్‌ రెడ్డి పై ఇంకా కేసు నడుస్తోందన్నారు. '' మహిపాల్‌ రెడ్డి అనవసరంగా పోలీసులను మాపై ఊసిగొల్పితే సహించేది లేదు. నీ అంతు చూస్తా '' అని వార్నింగ్‌ ఇచ్చారు. '' తను డబ్బులిస్తే మహిపాల్‌ రెడ్డి తన జీపుకు టైర్లు వేయించుకున్నాడని ఎద్దేవా చేశారు. నీ వాహనం పోతే రెండు లక్షలు ఇచ్చాను.. గత చరిత్ర మర్చిపోకూడదు '' అని అన్నారు.

గో మాంసం దుకాణాలను రేపటి లోపుగా తీసేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి : నందీశ్వర్‌ గౌడ్‌
'' నా ప్రాణం పోయినా మహిపాల్‌ రెడ్డి ని వదలేది లేదు '' అని నందీశ్వర్‌ గౌడ్‌ అన్నారు. బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మహిపాల్‌ రెడ్డి ఒక వర్గానికే కొమ్ము కాస్తున్నాడని మండిపడ్డారు. హిందుత్వ వ్యతిరేకి మహిపాల్‌ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగంగా పటాన్‌ చెరు రోడ్డుపై గోమాంసం అమ్మేస్తున్నారని, దుకాణదారుల నుంచి ఎమ్మెల్యే తమ్ముడు కిరాయి వసూలు చేస్తాడని కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ దేవాలయాలను కబ్జాచేసి అమ్మేస్తున్నారని మండిపడ్డారు. చర్చిలకు, మసీదులకు ఇచ్చిన ప్రాధాన్యత హిందూ దేవాలయాలకు ఇవ్వటం లేదని ఆరోపించారు. ప్రజలు మహిపాల్‌ రెడ్డికి రాజకీయంగా కర్రుకాల్చి వాతపెడతారని అన్నారు. ఒకప్పుడు రౌడిగా ఉన్న మహిపాల్‌ రెడ్డి పై లేని బైండోవర్‌ కేసులు బిజెపి వారిపై ఎందుకు ? అని ప్రశ్నించారు. గో మాంసం దుకాణాలను రేపటి లోపుగా తీసేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డికి తొత్తులుగా పనిచేస్తున్న డిఎస్పీ, సీఐని తక్షణమే తీసేయాలని డిమాండ్‌ చేశారు.