Nov 01,2023 10:15

ఇంఫాల్‌ : మణిపూర్‌లో హింసాకాండకు ముగింపు కనుచూపు మేర కనిపించడం లేదు. తాజాగా జరిగిన హింసాకాండలో ఒక పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు. భారత్‌-మయన్మార్‌ సరిహద్దు పట్టణం మోరేలో ఒక పాఠశాల మైదానాన్ని శుభ్రపరిచే పనిని పర్యవేక్షిస్తూ ఉండగా.. సబ్‌-డివిజనల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ (ఎస్‌డిపిఒ) చింగ్తం ఆనంద్‌కుమార్‌పై దుండగులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతూ మరణించారు. రాష్ట్ర పోలీసులు, సరిహద్దు భద్రతా దళం సంయుక్తంగా హెలిప్యాడ్‌ నిర్మాణం కోసం పాఠశాల మైదానాన్ని శుభ్రం చేస్తుండగా ఈ దారుణం జరిగిందని అధికారులు చెప్పారు. మోరేలో భారీగా మోహరించిన భద్రతా సిబ్బందిని ఉపసంహరించాలని కోరుతూ కొన్ని రోజుల నుంచి ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ ఘటనపై మణిపూర్‌ కేబినెట్‌ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఎస్‌డిపిఒపై కాల్పులు జరిపిన సాయుధులపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌ తెలిపారు. మరణించిన పోలీసు అధికారి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించడానికి కేబినేట్‌ ఆమోదం తెలిపింది. నిందితుల్ని పట్టుకునేందుకు మోరే, పరిసర ప్రాంతాల్లో సంయుక్త ఆపరేషన్‌కు బలగాలను ఆదేశించింది.