Oct 25,2023 10:50
  • నెల్లూరు వైసిపి, టిడిపి నేతల ప్రకటన
  • పరస్పర ఆరోపణలు
  • స్పందించని ఉన్నతాధికారులు

ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి : నెల్లూరు జిల్లా సైదాపురంలో చోటుచేసుకుంటున్న అక్రమమైనింగ్‌ వ్యవహారంపై ప్రజాశక్తిలో ప్రచురితమైన కథనం కలకలం రేపుతోంది. 'నెల్లూరులో కెజిఎఫ్‌' శీర్షికతో ప్రచురితమైన కథనంలోని అంశాలను జిల్లాకు చెందిన వైసిపి, టిడిపి నేతలు ధృవీకరించారు. విడివిడిగా నిర్వహిం చిన విలేకరుల సమావేశంలో వేల కోట్ల రూపాయల విలువైన తెల్లరాయి అక్రమంగా విదేశాలకు తరలివెళ్లిపోతోందని వీరు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, అక్రమ మైనింగ్‌కు కారణం మీరంటే మీరని ఆరోపణలు చేసుకున్నారు. ఇంతజరుగుతున్నా అధికారయంత్రాంగం మాత్రం ఈ వ్యవహారంపై పెదవి విప్పడం లేదు. పై స్థాయి నుండి ఒత్తిళ్లు ఉండటమే దీనికి కారణమన్న ప్రచారం జరుగుతోంది.
 

                                                                   కదలని అధికారులు

ప్రజాశక్తిలో వార్తాకథనం ప్రచురితమైన తరువాత అక్రమార్కులు మైనింగ్‌ కార్యకలాపాలను నిలిపివేశారు. మైనింగ్‌ నడుపుతోన్న యార్డ్‌లు, ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. వీరి ఆఫీసులకు తాళాలు కనపడుతున్నాయి. రవాణా నిలిచిపోయింది. అయితే, అధికారయంత్రాంగంలో నామమాత్రంగా కూడా కదలిక లేదు. యార్డుల్లో అక్రమంగా నిలువ వచ్చిన తెల్లరాయి బాహాటంగా కనిపిస్తున్నప్పటికీ దానిని స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచన కూడా అధికారయంత్రాంగానికి రాకపోవడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది, ఇక లైసెన్స్‌ల తనిఖీ వంటి సాధారణ కార్యక్రమాలను కూడా అధికారులు చేపట్టలేదు. అటవీ, రెవిన్యూతో పాటు మైనింగ్‌ శాఖ అధికారులు కూడా కిమ్మనకుండా ఉండటం చర్చనీయాంశంగా మారుతోంది. మరోవైపు వైసిపి, టిడిపి నేతలు అధికారుల పైనే ఆరోపణలు చేశారు. వారి వల్లే అక్రమ మైనింగ్‌ జరుగుతోందని ఇరు పార్టీల నేతలూ విమర్శించినా అధికార యంత్రాంగంలో స్పందన లేకపోవడం గమనార్హం.

                                                                  మాఫియాలో వైసిపి పెద్దలు..

టిడిపి మైనింగ్‌ మాఫియాలో వైసిపి పెద్దల హస్తం ఉందని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. ఎంఎల్‌ఎలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి , బీద రవిచంద్రతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సైదాపురంలో ఎలాంటి అనుమతుల్లేకుండా వైసిపినేతలు అక్రమంగా రాళ్లు తరలిస్తున్నారన్నారు.ఇప్పటికే వెయ్యి కోట్ల సంపద తరలిపోయిందని, మరో రూ.500 కోట్ల సంపద సిద్ధంగా ఉందన్నారు. వైసిపి పెద్దలు ఇందులో సూత్రధారులుగా ఉన్నారన్నారు. జిల్లా అధికారులు కనీసం పట్టించుకోవడం లేదన్నారు. రోజూ వందల లారీలు, హిటాచీలు, టిప్పర్లు అక్కడ పనిచేస్తున్నాయని, అటవీ, ప్రభుత్వ భూములు తవ్వేస్తున్నా అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారన్నారు. ఈ వ్యవహారంపై సిబిఐతో దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. అక్రమ మైనింగ్‌ ద్వారా వచ్చిన డబ్బుతో వైసిపి ఎన్నికలకు సిద్ధమవుతోందన్నారు.

                                                            75శాతం టిడిపి వారే : అనిల్‌కుమార్‌

సైదాపురం మండలంలో వేల కోట్ల రూపాయల విలువైన తెల్లరాయి అక్రమంగా రవాణా కావడం నిజమేనని వైసిపి నేత, మాజీ మంత్రి, నెల్లూరు ఎంఎల్‌ఏ అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన ఐదు నెలల నుంచి సాగుతుందన్నారు. ఈ మాఫియాలో 75 శాతం మంది టిడిపి నేతలున్నారని ఆయన చెప్పారు. వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్దికి స్థానిక పరిస్థితులపై అవగాహన లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. లీజు లేకపోయినా, అయిపోయినా తెల్లరాయి దోచుకుపోతున్నారన్నారు. అధికారులపై కూడా ఆయన ఆరోపణలు చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలకు అనుకూలంగా వారు వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఈ విషయాన్ని సిఎం దృష్టికి తీసుకుపోతానని చె అన్నారు.