Oct 09,2023 16:59

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీ 6 గ్యారెంటీలతో తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు రావడం ఖాయమని.. తాము ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో సీఎం కేసీఆర్‌ కు చలి జ్వరం వచ్చిందని తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలను కల్వకుంట్ల కుటుంబం పట్టి పీడిస్తోందని విమర్శించారు. ప్రజాధనాన్ని కేసీఆర్‌ కుటుంబం దోచుకుందని ఆరోపించారు. సచివాలయ నిర్మాణంలోనూ దోపిడీ జరిగిందని వెల్లడించారు. తెలంగాణను బీఆర్‌ఎస్‌ వంచించిందని, ప్రతి రంగంలోనూ కేసీఆర్‌ కుటుంబం అవినీతికి పాల్పడిందని మండిపడ్డారు. అయితే, వచ్చే డిసెంబరులో తెలంగాణలో మరో అద్భుతం జరగబోతోందని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలకు విముక్తి లభిస్తుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ఇక విశ్రాంతి తీసుకునే సమయం వచ్చిందని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.