Feb 28,2023 21:42

బ్యాంకాక్‌: మహిళల స్నూకర్‌ ప్రపంచకప్‌ టైటిల్‌ను భారత్‌-ఏ గెలుచుకుంది. సోమవారం రాత్రి జరిగిన ఫైనల్లో భారత్‌-ఏ మహిళలజట్టు 4-3 ఫ్రేముల తేడాతో 12సార్లు ప్రపంచకప్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌-ఏపై సంచలన విజయం సాధించింది. భారత్‌-ఏ తరఫున అమీ కమానీ-అనుపమ రామచంద్రన్‌ జోడీ ప్రాతినిధ్యం వహించారు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో 4-3 (56-26, 67(51)-27, 41-61, 27-52, 68(34)-11, 55-64, 78-39) ఫ్రేముల తేడాతో ఇంగ్లండ్‌-ఏకు చెందిన రిన్నే ఎవాన్స్‌-రెబెక్కా కెన్నాలను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. రెబెక్కా కెన్నా ప్రపంచ 4వ ర్యాంకర్‌. ఫైనల్లో విజయం తర్వాత కమానీ మాట్లాడుతూ.. 2011నుంచి తిరిగి స్నూకర్‌ ఆడడం ప్రారంభించానని, ఇది తన తొలి ప్రపంచకప్‌టైటిల్‌ అని, ఒక మ్యాజిక్‌లా అనిపిస్తోందని, కష్టానికి తగ్గ ఫలితం దక్కినందుకు సంతోషంగా ఉందని వెల్లడించింది. తొలి టోర్నమెంట్‌లోనే టైటిల్‌ విజేతగా నిలిచినందుకు సంతోషంగా ఉందని, వాతావరణం అలవాటు పడడానికి, టేబుల్‌పై సర్దుబాటు చేసుకొనేందుకు సమయం పట్టిందని అనుపమ తెలిపింది.

INDIA