
భారతదేశం లోని కొందరు చక్రవర్తులు తమ మంత్రులుగా, సేనాపతులుగా ఎవరిని ఎంచుకున్నారో, ఎవరిని నియమించుకున్నారో గమనించండి. వ్యక్తిగత అభిప్రాయాలు ఏవి ఉన్నా, వాటిని ఒక్క క్షణం పక్కనపెట్టి, సమ దృష్టితో ఆలోచించి చూడండి. అక్బర్ చక్రవర్తి ముస్లిం రాజు కదా? అతని దగ్గర పనిచేసిన వారు హిందువులైన తోడర్మల్, బీర్బల్, మాన్సింగ్! ఛత్రపతి శివాజీ హిందూ రాజు కదా ? అతని దళపతిగా పనిచేసినవాడు దర్యా సారంగ్. సేనాపతులు ఇబ్రహింఖాన్, దౌలత్ ఖాన్లు అయినప్పుడు వీరు మతవాదులవుతారా? లౌకికవాదులవుతారా? ఏ కొంచెం ఇంగిత జ్ఞానం ఉన్నవారికైనా విషయం బోధపడుతుంది. ఆ తర్వాత ఔరంగజేబు సర్వసైన్యాధిపతి జయసింగ్. ఇక దక్షిణ భారతదేశంలో టిప్పు సుల్తాన్ దగ్గర ప్రధానిగా ఉన్నది పూర్ణయ్య. హైదరాబాదు తానీషా దగ్గర మంత్రులు అక్కన్న, మాదన్నలు. మరి వీరిని లౌకికవాదులందామా? మతవాదులందామా ?
సరే, ఈ విషయాలు అలా ఉండనిచ్చి - వీర శైవులు, వీర వైష్ణవుల మధ్య హోరాహోరిగా పోట్లాటలు ఎందుకు జరిగాయి? ఇద్దరూ వైదిక మతాచారాలు పాటించినవారే కదా? మరి వీరి మధ్య మారణహోమాలు ఎందుకు జరిగాయి?వీరిలో మతవాదులెవరు, లౌకికవాదులెవరన్నది ఇప్పుడు ఆలోచించి తేల్చుకోండి! మనువాదులు అఘాయిత్యాలకు, అత్యాచారాలకు పాల్పడి, వారి తప్పుల్ని కప్పి పుచ్చుకోవడానికి గత కాలపు ముస్లిం పాలకుల్ని, ఈ కాలపు ముస్లిం పౌరుల్ని దుయ్యబడుతుంటారు. అర్థరహితమైన వాదనలు చేస్తూ, అభాసుపాలవుతుంటారు. ఒక క్రమ పద్ధతిలో విశ్లేషించుకుంటూ వస్తే, గతంలోనూ, ప్రస్తుతంలోనూ మనువాదులు చేసిన, చేస్తున్న దుర్మార్గాలు స్పష్టంగా కళ్ళ ముందుంటాయి. ఇలాంటి వాస్తవ స్థితిగతులు విస్మరిస్తూ దేశం విశ్వగురువు కాలేదు. వీలైనంత వరకు అభూత కల్పనలు ప్రచారం చేసుకుంటూ, 'విశ్వగురువు' అయ్యానని అనుకుంటోంది.
దేశం విశ్వగురువుగా నిలబడాలంటే ఇదిగో ఇలాంటి కట్టుకథలు నమ్ముతూ బతుకుతుండాలి! ఉదాహరణకు కొన్ని చూద్దాం!! రాముడు పాయసానికి పుట్టాడు. సీత భూమికి పుట్టింది. వినాయకుడు నలుగు పిండికి, పార్వతి మంచు కొండకు పుట్టారు. శ్రీశుకుడు చిలుకకు, మాండవ్యుడు కప్పకు, శౌనకుడు కుక్కకు, అశ్వద్థామ గుర్రానికి, విశ్వామిత్రుడు గాడిదకు, వాల్మీకి పుట్టకు, రుష్యశృంగుడు జింకకూ పుట్టారు! విష్ణుమూర్తి బొడ్డు లోంచి బ్రహ్మ పుడితే, బ్రహ్మ మనసు లోంచి సరస్వతి పుట్టింది. ఇకపోతే, ఆదిశక్తి గుడ్లు పెట్టగా త్రిమూర్తులు పుట్టారు కదా? మహాలక్ష్మి పాల సముద్రానికి, కర్ణుడు సూర్యుడికి పుట్టారు. కట్టుకథల కల్పిత పురాణాల్లో జన్మ త్తాంతాలు చాలా విచిత్రంగా ఉంటాయి. సరే, గొప్ప సృజనాత్మక రచనలంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ, అవన్నీ నిజం, వాటిని మనస్ఫూర్తిగా విశ్వసించాలి. విశ్వసించి పూజించాలి, పూజించి మోక్షం సాధించాలి, జన్మ రాహిత్యం సాధించాలి - అని మత పండితులు, మత బోధకులు చెపుతూ ఉంటేనే చోద్యంగా ఉంటుంది. వారి అజ్ఞానానికి జాలి కలుగుతుంది. ఒకవైపు ఆధునిక మానవులుగా జీవిస్తూ, మరోవైపు విచక్షణా జ్ఞానం లేని, మానవ జాతి 'తొలి దశ లోని వారిగా' ఆలోచిస్తూ ఉంటే, బాధ కలుగుతుంది! వీరెప్పుడు ఆధునికుడి ఆలోచనను అందుకోగలరూ? అనిపిస్తుంది. వారి మెదళ్లను చుట్టుకుని ఉన్న మూఢత్వాన్ని బద్దలు కొట్టుకుని బయటపడితే గాని వారికి వాస్తవాలు అర్థం కావు. కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దేశ ప్రజలు బయటపడరు. ఈ దేశ నాయకులు బయటపడనీయరు. బయట పడితే దేశం విశ్వగురువు కాకుండా పోతుందేమోనని...వారికి బెంగ, బుగులు. తాము ఎలా చచ్చినా ఫరవాలేదు కానీ దేశం మాత్రం మూర్ఖత్వానికి బ్రాండ్ అంబాసిడర్గా నిలబడాలన్నదే వారి కోరిక! ప్రపంచం నవ్విపోతున్నా పట్టించుకోకుండా 'తామే విశ్వగురువులమ'ని చెప్పుకు తిరుగుతుండాలి !
''వేదాలు 1.96 కోట్ల పూర్వం వెలువడ్డాయి. ఓం-అనే శబ్ద తరంగాలే ప్రపంచంలోని అన్ని శబ్ద తరంగాలకు మూలం-స్తబ్దుగా ఉన్న ప్రకృతి ఓం శబ్దంతోనే చైతన్యవంతమవుతుంది. మానవ మస్తిష్క చైతన్యానికి ఓం-శబ్ద తరంగాలే ముఖ్యం!'' అని చెప్పుకుంటూ ఆత్మద్రోహం చేసుకోవడం తప్పిస్తే... ఏదీ రుజువు కాలేదు. ఇలాంటి మూర్ఖత్వం వ్యాప్తి చేస్తూ పాపం దేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టాలని తాపత్రయ పడుతుంటారు. గత కాలపు పురాణాలే కాదు, వాటి సారాంశాన్ని నేటి వ్యాపార సినిమాలు కూడా తమ శాయశక్తులా ప్రచారం చేస్తున్నాయి. అఖండ, దేవి, నాగదేవత, పాతాళభైరవి, దయ్యం, పిశాచం, ఆత్మ మొదలైన ఫాంటసీ ఫిక్షన్కు సంబంధించినవి - ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు చూపించే సినిమాలన్నీ సమకాలీన సమాజాన్ని తప్పుదారి పట్టించేవే. దర్శక, నిర్మాతల, సినీ హీరోల నమ్మకాలకు మరింత మూర్ఖత్వాన్ని మూఢత్వాన్ని జోడించి- ముఖ్యంగా సైన్సును వాడుతూ, సైంటిఫిక్ స్పిరిట్కు వ్యతిరేకంగా సినిమాలు తీయడం-జనావళిని అంధవిశ్వాసాల్లో ముంచడం క్షమించరాని నేరం! సమాజ ద్రోహం!! బహుశా దేశం విశ్వగురువు కావాలంటే ఇలాంటి అసందర్భమైన, అసంగతమైన అబద్ధాల ప్రచారం కొనసాగాల్సిందేనేమో ?
ఆధునిక నాస్తికోద్యమ నిర్మాత గోరా (15.11.1902 - 26.7.1975) ఏమన్నారో ఒకసారి జాగ్రత్తగా గమనించండి. అంతేకాదు, సీరియస్గా ఆలోచించండి...''దేవుడనేది మానవుడు కల్పించిన అబద్ధం! చాలా అబద్ధాల వలెనే గత కాలంలో అది కొంత వరకు ప్రయోజనకరంగా ఉంటే ఉండిందేమో! కానీ, అన్ని అబద్ధాల వలెనే ఇది కూడా రాను రాను జీవితాన్ని కల్మషం చేసింది. కనుక, మానవ సంఘంలో అవినీతి కడిగివేయబడి, నీతి పెరగాలంటే దైవ విశ్వాసం పోవాలి! పోక తప్పదు!!'' అబద్ధాలతో దేశం విశ్వగురువు ఎన్నటికీ కాలేదన్నది గ్రహించాల్సిన సారాంశం.
భారత్ 'విశ్వగురువు' ఎలా అయ్యిందంటే...కొన్ని ఉదాహరణలు చూద్దాం! పేదరికంలో భారత్ నైజీరియాను అధిగమించింది. 2018లో నైజీరియాలో 8.7 కోట్ల కటిక పేదలుంటే భారత్లో 7.3 కోట్ల కటిక పేదలు మాత్రమే ఉన్నారు. 2022లో నైజీరియాలో పేదలు 7 కోట్లకు తగ్గిపోతే, భారత్లో కటిక పేదల సంఖ్య విపరీతంగా పెరిగి 8.3 కోట్లకు చేరింది. ఈ దేశ ప్రధాని రోజుకు 18 గంటలు అవిశ్రాంతంగా పని చేసి, దేశంలో దారిద్య్రాన్ని ఘనంగా పెంచుతున్నారు. తమ హిందూత్వ భావజాలంతో దేశాన్ని విశ్వగురువు చేయాలని తాపత్రయ పడుతున్నారు. డాలర్తో మన రూపాయి మారకం 2014లో 59గా ఉంటే, 2022లో 80కి చేరింది. రూపాయి విలువ ఎంత పడిపోతుంటే, దేశం అంత విశ్వగురువు అవుతుందన్న మాట! వంటగ్యాస్ 2014లో రూ.410 ఉంటే, 2022 నాటికి అది రూ.1053కు పెరిగింది. సామాన్యుడి జీవితం ఎంత భద్రంగా ఉందో అంచనా వేసుకోవచ్చు. 2014లో ఈ దేశానికి అప్పు 58లక్షల కోట్లు ఉంటే, 2022లో దాన్ని గణనీయంగా 139 లక్షల కోట్లకు పెంచిన ఘనత బీజేపీ సూపర్ మ్యాన్, కాపలాదారు, చారువాలా అయిన మోడీదే! ప్రధాని స్వంత రాష్ట్రం గుజరాత్లో జులై 2022 నాటికి ఇంకా కొనసాగుతున్న విషయం చూడండి... ఆ రాష్ట్రంలో పాఠశాలల్లో కులం పేరుతో వివక్ష ఇంకా కొనసాగుతూ ఉంది. అక్కడ నిమ్నజాతుల పిల్లల్ని విడిగా దూరంగా కూర్చోబెడుతున్నారు. హీనంగా చూస్తున్నారు. 'మేం జంతువులం కాదు గదా? మనుషులమే కదా?' అని ఆ జాతుల ప్రజలు ఆక్రోశిస్తున్నారు. అయితే, వినేవారే లేరు. ఎందుకంటే... రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పెద్దలు దేశాన్ని విశ్వగురువు చేసే పనిలో తలమునకలై ఉన్నారు కదా !
సాధారణ శకం 600 నాడు ధర్మకీర్తి అనే ఒక బౌద్ధదార్శనికుడు ఇలా అన్నాడు...''కులాన్ని చూసుకుని గర్వపడటం - వేదాలను ప్రమాణంగా భావించడం - స్నానం ద్వారా పుణ్యం సంపాదించడం - ఉపవాసాల ద్వారా శరీరాన్ని బాధించడం... ఇలాంటివన్నీ బుద్ధిహీనులు చేసే పనులు.'' దీనికి అనుగుణంగా చార్వాకులు చెప్పిన అంశం గూర్చి కూడా ఆలోచించాలి! ''ప్రతిమా అల్ప బుద్ధీనాం'' అన్నారు వాళ్ళు. అంటే... విగ్రహాలు చేసింది అల్పబుద్ధిగల వారికోసమే! అని అర్థం! ఈసారి వర్షాకాలంలో వర్షాలు విపరీతంగా పడ్డాయి. ఫలితంగా భద్రాచలంలో రాముడు మునిగిపోయాడు. పట్టిసీమలో శివుడు కొట్టుకుపోయినంత పనైంది. కానీ, పొంగే గోదాట్లో పడి చిన్న కుక్కపిల్ల ఒకటి ఈదుకుంటూ ఈదుకుంటూ వచ్చి గట్టెక్కింది. బతికి బయటపడ్డానన్న సంతోషంలో నదివైపు గర్వంగా చూసింది. ఆ దేవుళ్ళకు రాని ఈత - వచ్చిన ప్రాణి గొప్పదా? కాదా? ఆలోచించాలి కదా? ఏమైనా, జీవుల విలువ, మనుషుల విలువ తెలుసుకుని మసలుకోవడం మంచిది... అని మనం అంటున్నాం! అంతే!! దేశం ప్రపంచ దేశాలలో మానవత్వంతో తలెత్తుకు నిలబడితే చాలు. ''విశ్వగురువు'' కావాల్సిన పనే లేదు.
/ వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత, జీవశాస్త్రవేత్త/
డా|| దేవరాజు మహారాజు