- జమ్ము కాశ్మీర్ ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి
- అధికార లాంచనాలతో నేడు అంత్యక్రియలు
ప్రజాశక్తి - పాములపాడు : జమ్మూకాశ్మీర్ బారాముల్లా జిల్లాలో సోమవారం జరిగిన ఉగ్రవాదుల ఎదురుకాల్పుల్లో భారత జవాన్ వీర మరణం చెందారు. ఆయన కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు... నంద్యాల జిల్లా పాములపాడు మండలం మద్దూరు మజరా గ్రామం కృష్ణనగర్కు చెందిన సిరిగిరి సురేంద్ర (24) 2019 మార్చి 31న ఆర్మీలో చేరారు. జమ్ముకాశ్మీర్లో సోమవారం జరిగిన ఉగ్రవాదుల ఎదురుకాల్పుల్లో మధ్యాహ్నం 12 గంటలకు సురేంద్ర వీర మరణం చెందారు. మరణ వార్త తెలిసిన కృష్ణానగర్లోని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగారు. పేద రైతులైన సిరిగిరి సుబ్బయ్య, సుబ్బమ్మల దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. దేశ రక్షణ కోసం చిన్న కుమారుడు సురేంద్రను ఆర్మీలోకి పంపారు. మంగళవారం సురేంద్ర భౌతికకాయం స్వస్థలానికి చేరుకుంది. అధికార లాంఛనాలతో సురేంద్ర అంత్యక్రియలు బుధవారం జరగనుంది. సురేంద్ర భౌతికకాయాన్ని తహశీల్దార్ రత్న రాధిక, ఎంపిడిఒ గోపికృష్ణ, ఇఒఆర్డి శ్రీనివాసులు నాయుడు సందర్శించారు.










