హైదరాబాద్: గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఖరారు చేసింది. జూన్ 5 నుంచి 12 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇటీవల వెల్లడించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల్లో మొత్తం 25,050 మంది అభ్యర్థులు మెయిన్స్కు అర్హత సాధించారు. హైకోర్టు ఆదేశాలతో సమాంతర విధానంతో రిజర్వేషన్లు చేపట్టినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. మల్టీ జోన్, రిజర్వేషన్ ప్రకారం 1:50 ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేశారు. మొత్తం 503 గ్రూప్-1 పోస్టులకు గాను 3.80 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రిలిమ్స్కు రాష్ట్రవ్యాప్తంగా 1019 పరీక్ష కేంద్రాల్ని ఏర్పాటు చేయగా, 2,86,051 అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే.
డిగ్రీ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ వాయిదా
డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టుల దరఖాస్తుల స్వీకరణ వాయిదా వేసినట్టు టీఎస్ పీఎస్సీ తెలిపింది. ఫిబ్రవరి 15 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు అధికారులు తెలిపారు. కళాశాల విద్యా శాఖలో ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టులకు ఫిబ్రవరి 15 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు పేర్కొన్నారు.










