Jun 29,2022 08:09
  • జోరుగా బిటి-3 పత్తి విత్తనాల అమ్మకాలు.. ప్రభుత్వ చోద్యం

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి - ఈ ఏడాది సైతం అనుమతుల్లేని గ్లెయిసెల్‌ పత్తి విత్తనాలు గ్రామాల్లోకి వెల్లువెత్తాయి. తొలకరి వర్షాలతో రైతులు ఖరీఫ్‌ సాగుకు సిద్ధమైన వేళ నిషేధించిన గ్లెయిసెల్‌ విత్తన అక్రమ వ్యాపారం యధేచ్ఛగా సాగుతోంది. ఐదారేళ్లుగా వ్యాపారంలో ఆరితేరిన మాఫియా పకడ్బందీ నెట్‌వర్క్‌తో అత్యంత రహస్యంగా విత్తనాలను పంపిణీ చేస్తోంది. ప్రతి సీజన్‌లో గ్లెయిసెల్‌ విత్తనాలు, ప్రమాదకర గ్లెయిసెల్‌ హెర్బిసైడ్‌ అక్రమ దందా రూ.వందల కోట్లలో జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేదు. అక్కడక్కడ నామమాత్రపు దాడులే తప్ప పూర్తి స్థాయిలో చర్యల్లేవు. గ్రామ స్థాయిలో సచివాలయాలు, వలంటీర్లు, రైతు భరోసా కేంద్రాలు, వ్యవసాయశాఖ, ఇంటెలిజెన్స్‌, పోలీస్‌ వ్యవస్థలు అక్రమ విత్తన వ్యాపారాన్ని అడ్డుకోలేకపోవడంపై అనుమానాలు కలుగుతున్నాయి. టిడిపి ప్రభుత్వంలో మొదలైన ఈ వ్యాపారం వైసిపి వచ్చాకా మూడేళ్లగా నిరాటంకంగా కొనసాగుతోంది. అనుమతుల్లేని విత్తనాలు, రసాయన మందుల వలన పంట దిగుబడులు తగ్గుతున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు పర్యావరణానికి హానికరమని నిపుణులు ఘోషిస్తున్నారు.
 

                                                           కలుపుతీత చూపించి...

పత్తికి కలుపు సమస్య కాస్త ఎక్కువ. కూలీలకు ఖర్చవుతుందని, తమ విత్తనాలు వాడి, తామిచ్చే కలుపు మందు స్ప్రే చేస్తే ఆ బాధ తప్పుతుందని, పైగా దిగుబడి బాగా వస్తుందని వ్యాపారులు రైతులను బుట్టలో వేసుకుంటున్నారు. రౌండప్‌ రెడీ ఫ్లెక్స్‌ (ఆర్‌ఆర్‌ఎఫ్‌)/ హెర్బిసైడ్‌ టాలరెంట్‌ (హెచ్‌టి)/ గ్లెయిసెల్‌/బోల్‌గార్డ్‌-3/ బిటి-3... పేరేదైనా తమ విత్తనాలు వేస్తే కలుపు మందు కొట్టినా పత్తి మొక్క చావదని ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం అనుమతించిన బిటి-2 రకం 450 గ్రాముల విత్తనాల ప్యాకెట్‌ ఎంఆర్‌పి రూ.810. దానికి 120 గ్రాముల రిఫ్యూజ్‌ సీడ్‌ ప్యాకెట్‌తో కలిపి ఇవ్వాలి. గ్రామాల్లో బిటి-3 పేరిట 450 గ్రాముల సీడ్‌ ప్యాకెట్‌ డిమాండ్‌కనుగుణంగా రూ.వెయ్యి నుండి 1,500 పలుకుతోంది. రిఫ్యూజ్‌ సీడ్‌ ఇవ్వరు.
 

                                                              ఇష్టమొచ్చిన బ్రాండ్లు

పత్తి అధికంగా సాగవుతున్న గుంటూరు, పల్నాడు, కర్నూలు, నంద్యాల, ఎన్‌టిఆర్‌, అనంతపురం, శ్రీసత్యసాయి, తూర్పుగోదావరి, విజయనగరం, ఏలూరు జిల్లాల్లో గ్లెయిసెల్‌ పత్తి విత్తనాల అమ్మకాలు సాగుతున్నాయి. మేఘన-45, పవన్‌, పల్లవి, పావని, మోనిక తదితర పేర్లతో ప్యాకెట్లు విక్రయిస్తున్నారు. ప్యాకెట్‌పై తప్పనిసరిగా ప్రొడ్యూసర్‌, ప్రాసెస్‌, మార్కెటింగ్‌ అడ్రస్‌ ఉండాలి. ప్యాక్‌ చేసిన తేదీ, చెల్లుబాటయ్యే తేదీ ఉండాలి. లాట్‌ నెంబర్‌, ఎంఆర్‌పి తప్పనిసరి. ప్యాకెట్లపై ఇవేవీ ఉండవు. రహస్యంగా అమ్ముతున్నందున బిల్లు అసలే ఇవ్వట్లేదు. గ్రామాల్లో ఏజెంట్లను పెట్టుకొని వారి ద్వారా రైతులను రహస్య ప్రదేశానికి పిలిపించి సీడ్‌ ప్యాకెట్లు అంటగడుతున్నారు. కొన్ని చోట్ల ముందస్తుగా రైతుల నుండి అడ్వాన్స్‌లు తీసుకొని డెలివరీ చేస్తున్నారు. అంతే రహస్యంగా కలుపు రాకుండా ఉండేందుకు నిషేధించిన గ్లెయిసెల్‌ రసాయన మందును ఏజెంట్ల ద్వారా అందిస్తున్నారు. ఎకరానికి లీటరు మందు స్ప్రే చేయాలని, ఆ విధంగా కనీసం రెండు మూడు సార్లు కొట్టాలని, మందు ధర లీటర్‌ రూ.500 వరకు గుంజుతున్నారు. ఈ వ్యాపారమంతా వివిధ దొంతర్లలో కమీషన్లపైనే నడుస్తోంది.