Oct 13,2023 21:53

ప్రజాశక్తి - సీలేరు, మోతుగూడెం (అల్లూరి సీతారామరాజు జిల్లా):తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అల్లూరి జిల్లా జికె వీధి మండలంలోని సీలేరు, చింతూరు మండలంలోని మోతుగూడెంల్లో సిఐటియు ఆధ్వర్యాన విద్యుత్తు కాంట్రాక్టు కార్మికులు శుక్రవారం ఆందోళనలు చేశారు. తొలుత నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఎపి జెన్‌కో యాజమాన్యం తక్షణమే తమ డిమాండ్లను నెరవేర్చాలని పెద్దపెట్టున నినదించారు. విద్యుత్తు శాఖ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఆయా చోట్ల జరిగిన కార్యక్రమాల్లో సిఐటియు నాయకులు చింతా రాంబాబు, జె రత్నాకర్‌, బివి రమణ మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. 2002 పిఆర్‌సి ప్రకారం మినిమం స్కేలు అమలు చేయాలని, నేరుగా యాజమాన్యమే జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఎపి జెన్‌కో ఆస్పత్రిలో ఉచితంగా వైద్య సేవలు అందించాలని, పీస్‌ వర్క్‌ విధానాన్ని రద్దుచేసి మ్యాన్‌ పవర్‌గా మార్చాలని కోరారు. కార్యక్రమాల్లో సంఘం నాయకులు బి లక్ష్మణ్‌, టి విష్ణు, మల్లేష్‌, సన్యాసిరావు, సతీష్‌, మహేష్‌ పాల్గొన్నారు.