
హైదరాబాద్: తెలంగాణలో బిఆర్ఎస్ అక్రమ, అవినీతి పాలన కొనసాగుతోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. ఈ పాలనను తిప్పికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్లో ఉన్న బిఆర్ఎస్ మద్దతుదారులను గెలిపించేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వాళ్లను బిఆర్ఎస్ నుంచి నుంచి రాజీనామా చేయించి కాంగ్రెస్లో చేర్పించారని అన్నారు. '' నవంబర్ 30న కేసీఆర్కి గుడ్బై చెప్పాలంటే.. ముందు కాంగ్రెస్కు గుడ్బై చెప్పాలి. ఎక్కువ శాతం ఉన్న బీసీల నుంచి ఒక్క ముఖ్యమంత్రి కూడా లేరు. 60శాతం ఉన్న బీసీలకు 60శాతం సీట్లు ఇవ్వడానికి నేను సిద్దంగా ఉన్నా. పోటీ చేయాలనుకున్న వారు వారం రోజుల్లోగా రూ.10 వేలు గూగుల్పే చేసి, దరఖాస్తు పంపండి. బిఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే. కేసీఆర్పై 7 కేసులు వేశాను. దీంతో కేటీఆర్ నాపై దాడి చేయించారు. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తున్నాం. టికెట్ల కోసం అన్ని కులాల వారు ఎవర్నీ అడగొద్దు. ప్రజాశాంతి పార్టీ సిద్ధంగా ఉంది. వారం రోజుల్లోగా జాబితా విడుదల చేస్తాం. బిఆర్ఎస్ ఇస్తున్న పథకాలన్నింటికీ రెండు రెట్లు ఇస్తాం. పోటీకి సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటి వరకు 3600 మంది దరఖాస్తు చేశారు'' అని కేఏ పాల్ అన్నారు.