Sep 15,2023 09:44

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : శాసనసభ సమావేశాలు ఈ నెల 21న ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నరు జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ గురువారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. 21న ఉదయం 9 గంటలకు శాసనసభ, అదే రోజు ఉదయం 10 గంటలకు శాసనమండలి ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ నెల 20న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కేబినెట్‌ భేటీలో చర్చించనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిసింది. అవసరం మేరకు మరో రెండు రోజులు పెంచే వీలుంది. ఈ సమావేశాల్లో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లును, కొన్ని ఆర్డినెన్స్‌లకు సంబంధించిన బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంపై ప్రత్యేక చర్చ చేపట్టే వీలుందని తెలుస్తోంది. అయితే ఈ సమావేశాలను బహిష్కరించాలని టిడిపి సభ్యులు భావిస్తున్నట్లు సమాచారం.