Sep 16,2023 21:35
  • హిమంత రాజీనామాకు ప్రతిపక్షాల డిమాండ్‌

గువహటి : బిజెపి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తన భార్యకు ఆయాచిత లబ్ధి కలిగించే నిర్ణయాలు తీసుకోవడం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. కేంద్ర ప్రభుత్వ పథకం కింద రినికి భుయాన్‌ శర్మ రూ.10కోట్లు సబ్సిడీ పొందారు. దాంతోపాటు నాగన్‌ జిల్లా కలియాబార్‌ ఏరియాలో 25 ఎకరాలకుపైగా భూమిని వ్యవసాయ భూమిగా కొనుగోలు చేసి, పారిశ్రామిక భూమిగా మార్చుకుని కోట్లాది రూపాయల ప్రయోజనం పొందారు.
స్థానిక మీడియా పోర్టల్‌ అయిన క్రాస్‌ కరంట్‌లో ఇందుకు సంబంధించిన కథనం ప్రచురితమైంది. రినికి భుయాన్‌ శర్మ నేతృత్వంలోని ప్రైడ్‌ ఈస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.10 కోట్ల ప్రభుత్వ సబ్సిడీని పొందింది. కలియాబార్‌ ఏరియాలో మరో 12.5 ఎకరాల స్థలాన్ని కూడా ఆమె పొందారు. ఇదంతా జరిగింది 2022లో. ఆప్పుడు ఆ భూమిని వ్యవసాయ భూమిగా వర్గీకరించారు. ఆ తర్వాత ఆ భూమి కేటగిరీ పారిశ్రామిక భూమిగా మారిపోయింది. సీలింగ్‌ చట్టం కింద ఒక వ్యక్తి లేదా కంపెనీ 11.25 ఎకరాల కన్నా వ్యవసాయ భూమిని కలిగివుండరాదరి క్రాస్‌ కరంట్‌ రిపోర్ట్‌ పేర్కొంది. పైగా ఈ ఏడాది జులై 1న మరో 14 ఎకరాల భూమిని ముఖ్యమంత్రి భార్య కొనుగోలు చేశారు.
రినికి శర్మ నేతృత్వంలోని మీడియా హౌస్‌ వంద బీఘాలకు పైగా భూమిని కొనుగోలు చేయడమే కాకుండా ఆ ప్రాంతంలో ఆగ్రో పరిశ్రమను నెలకొల్పుతున్నామంటూ ఆహార ప్రాసెసింగ్‌ శాఖ నుంచి రూ.10 కోట్లు సబ్సిడీకూడా పొందింది. కాంగ్రెస్‌ ఎంపి గౌరవ్‌ గొగోరు దీని గురించి ట్వీట్‌ చేయడంతో ఈ వివాదం బయటకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుండి తాము ఎలాంటి సబ్సిడీ పొందలేదని ముఖ్యమంత్రి చెబుతూ వచ్చారు. పైగా ఈ ఆరోపణలు రుజువైతే ఆ మరుసటి రోజే రాజీనామా చేస్తానని అన్నారు. తొలుత స్థానిక మీడియా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. రాన్రానూ పెద్ద వివాదంగా మారడంతో ఇక దానిపై దృష్టి పెట్టింది.

ఆదివాసీల పేరుతో ఆస్తుల కబ్జా?

ఆదివాసీల పేరుతో ఆస్తులను పెంచుకోవాలని ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ భావిస్తున్నారని అంకాలిక్‌ గణమోర్చాకు చెందిన రాజ్యసభ సభ్యుడు అజిత్‌ భూయాన్‌ విమర్శించారు. అక్కడ వున్న ముస్లిములతోపాటు హిందువులు, గిరిజనులు అందరినీ బలవంతంగా తరలించి, తన కుటుంబ సభ్యుల ఆస్తులను విపరీతంగా పెంచుకున్నారని చెప్పారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా తరలింపులు వుంటే ఆమోదయోగ్యమే కానీ హిమంత ప్రభుత్వం న్యాయానికి సంబంధించిన అన్ని చట్టాలను దారుణంగా ఉల్లంఘించిందన్నారు. హిమంత సిఎం అయ్యాకా... ఆయన ఆస్తులు కలియాబార్‌లోనే కాకుండా అనేక ప్రదేశాల్లో రిసార్ట్‌లు, వాణిజ్య సముదాయాలు, టీతోటలు విపరీతంగా పెరిగాయని చెప్పారు. గౌహతి హైకోర్టుతోసహా ప్రభుత్వ కార్యాలయాలను ఉత్తర గౌహతికి మార్చాలని ప్రతిపాదించారని చెప్పారు. ఆ ప్రాంతాన్ని అర్బన్‌ సెక్టార్‌గా వర్గీకరించారని, తమ కుటుంబ లబ్ధికోసమే సిఎం ఇదంతా చేస్తున్నారని చెప్పారు.

అసెంబ్లీలో చర్చకు స్పీకర్‌ నిరాకరణ : ప్రతిపక్షాల వాకౌట్‌

సిఎం భార్యకు ఆయాచిత లబ్ధికి సంబంధించి వచ్చిన కథనాలపై చర్చించాలంటూ ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసును ఈ నెల 14న స్పీకర్‌ బిశ్వజిత్‌ డైమరీ నిరాకరించారు. దీనిని నిరసిస్తూ అస్సాం అసెంబ్లీ నుంచి ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, స్వతంత్ర ఎమ్మెల్యే అఖిల్‌ గొగోరు, సిపిఎం ఎమ్మెల్యే మనోరంజన్‌ తాలూక్దార్‌ వాకౌట్‌ చేశారు.

సిఎం రాజీనామా చేయాలి : కాంగ్రెస్‌ ఎంపి

ఈ సబ్సిడీ వివాదంపై ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ ఎంపి గౌరవ్‌ గొగోరు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ సబ్సిడీలనేవి వాస్తవంగా అవసరమున్న రైతులకు, స్థానిక పారిశ్రామికవేత్తలకు అందజేయాలి, కానీ ఇక్కడ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే తీసుకున్నారని ఆయన విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్రంగా దర్యాప్తు జరగాలని డిమాండ్‌ చేశారు.

నా భార్య మీడియా సంస్థకు వ్యాపారాలుంటే తప్పేంటి? : సిఎం ఎదురుదాడి

ఈవిషయంలో ఇప్పటివరకు రక్షణాత్మక వైఖరిని ప్రదర్శిస్తూ వచ్చిన ముఖ్యమంత్రి శుక్రవారం ఎదురుదాడికి దిగారు. రాష్ట్రంలోని అన్ని మీడియా సంస్థలకు వేరే వ్యాపారాలు వున్నాయని, అటువంటి సమయంలో ప్రైడ్‌కు వుండడంలో తప్పులేదని అన్నారు. స్వతహాగా పారిశ్రామికవేత్త అయిన తన భార్యను ఈ వివాదంలోకి ఎందుకు లాగుతారని ప్రశ్నించారు.