ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రైవేట్ వ్యక్తులు బొగ్గు మైనింగ్ చేసేందుకు అనుకూలంగా నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. చట్టంలో నేరంగా పరిగణించే 68 నిబంధనలను నేర రహితంగా సవరించింది. కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ మినరల్ కన్సెషన్ రూల్స్ -1960 (ఎంసిఆర్)ను తన నిబంధనలను నేరరహితం చేసే ఉద్దేశంతో సవరించింది. ఎంసిఆర్ నిఘా అనుమతి, ప్రాస్పెక్టింగ్ లైసెన్స్, మైనింగ్ లీజు వంటి ఖనిజ రాయితీల దరఖాస్తు, మంజూరును నియంత్రిస్తుంది. ఈ రాయితీలు గనుల అభివృద్ధి, నిర్వహణ కోసం వ్యాపారాలకు అనుకూలంగా ఉంటుంది. ఎంసిఆర్ పది నిబంధనలకు జరిమానా తగ్గించింది. అదనపు, కొరత రాయల్టీ సర్దుబాటు కోసం ఎక్స్ప్రెస్ నిబంధన ప్రవేశపెట్టింది. ప్రభుత్వం చెల్లించాల్సిన అద్దె, రాయల్టీ, రుసుము, ఇతర మొత్తాలను ఆలస్యంగా చెల్లించడంపై జరిమానా వడ్డీ రేటు 24 శాతం నుంచి 12 శాతానికి తగ్గించింది.










