ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :గ్రూపు-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 23 నుంచి 29 వరకు జరగాల్సిన పరీక్షలను జూన్ మొదటి వారానికి వాయిదా వేస్తున్నట్లు ఎపిపిఎస్సి ప్రకటించింది. ఏప్రిల్ 24 నుంచి మే 18 వరకు సివిల్స్ ఇంటర్వ్యూలు ఉండటంతో ఈ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు ఎపిపిఎస్సి మెంబరు సలాంబాబు వెల్లడించారు. ఎపిపిఎస్సి గ్రూపు-1 మెయిన్స్ పరీక్షలను జూన్ 3 నుంచి 9 వరకు నిర్వహించనున్నట్లు ఎపిపిఎస్పి అధికారులు వెల్లడించారు. సోమవారం యుపిపిఎస్సి సివిల్స్ ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఎపిపిఎస్సి తాజా నిర్ణయం తీసుకుంది. సివిల్స్ ఇంటర్వ్యూలకు రాష్ట్రం నుంచి పరీక్ష రాసే 25 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉంది. వీరిని దృష్టిలో ఉంచుకుని అధికారులు గ్రూపు-1 మెయిన్స్ పరీక్షల తేదీల్లో మార్పులు చేశారు.










