Nov 14,2022 22:02
  • ఈ దఫా కాంట్రాక్టు సిబ్బందికి ఉద్వాసన

వాషింగ్టన్‌ : టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత అందులోని ఉద్యోగుల భవిష్యత్తు తీవ్ర గందరగోళంగా మారింది. ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా ఆ సంస్థకు ఉన్న మొత్తం ఉద్యోగుల్లో సగం మందిని అంటే 3500 సిబ్బందిని తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా ట్విట్టర్‌కు కాంట్రాక్టు లేదా అవుట్‌సోర్సింగ్‌ పద్దతిలో పని చేసే మొత్తం 5,500 మందిలో 4,400 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు రిపోర్టు చేశాయి. వీరికి ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే శనివారం తొలగింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. తాజాగా ఉద్వాసనకు గురైన వారిలో అమెరికా సహా ఇతర దేశాలకు చెందిన కంటెంట్‌ మోడరేషన్‌, రియల్‌ ఎస్టేట్‌, మార్కెటింగ్‌, ఇంజినీరింగ్‌తో పాటు ఇతర విభాగాలకు చెందిన సిబ్బందిని ఉన్నారు. వీరికి సోమవారమే చివరి పని దినమని సమచారం. కంపెనీ ఇ-మెయిల్‌, ఇంటర్నల్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌తో ఉద్యోగులు యాక్సెస్‌ కోల్పోయిన తర్వాతే వారికి తొలగించబడినట్లు స్పష్టమైనట్లు తెలుస్తోంది. సాధారణంగా ట్విటర్‌, ఇతర సోషల్‌మీడియా వేదికల్లో విద్వేష, ఇతర హానికర విషయాలను కనిపెట్టి ట్రాక్‌ చేసేందుకు కాంట్రాక్టర్లపైనే ఎక్కువగా ఆధారపడుతుంటాయి. ఔట్‌సోర్సింగ్‌ విభాగాల ద్వారా ఒప్పంద ప్రాతిపదికన కంటెంట్‌ మాడరేషన్‌ కోసం ఉద్యోగులను నియమించుకుంటాయి. తాజాగా కంటెంట్‌ మోడరేషన్‌లోనే ఎక్కువ మందిని తొలగించినట్లు వచ్చిన రిపోర్టులతో ట్విటర్‌లో విద్వేష వ్యాప్తి మరింత పెరిగే అవకాశముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.