Jul 05,2023 10:27
  • జెండా ఊపి ప్రారంభించిన లెప్టినెంట్‌ జనరల్‌ జెఎస్‌ సిడాన

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో : ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 37వ సెయిలింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌ సెయిలింగ్‌క్లబ్‌లో ఈఎంఈ సెయిలింగ్‌ అసోషియేషన్‌(ఈఎంఈఎస్‌ఏ), లేజర్‌ క్లాస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీలను మంగళవారం లెప్టినెంట్‌ జనరల్‌, లేజర్‌ క్లాస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ జేఎస్‌ సిడాన జెండాఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెయిలింగ్‌ పోటీలకు హైదరాబాద్‌ ముఖ్యకేంద్రంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో 89మంది అనుభవజ్ఞులైన సీనియర్‌ సెయిలర్స్‌ పాల్గొంటున్నారని, ఆ క్రమంలో కలర్‌పుల్‌ బోట్లతో హుస్సేన్‌సాగర్‌ కనువిందు చేయనుందన్నారు. ఈ పోటీలు ఈనెల 9 వరకు జరగనున్నాయని చెప్పారు. తెలంగాణ స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ఇలాంటి ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో పాల్గొనే విధంగా యువతను ప్రోత్సహిస్తున్నదని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలో పాల్గొనేందుకు హుస్సేన్‌సాగర్‌ సెయిలింగ్‌ క్లబ్‌ ఒక వేదిక అని అన్నారు. ఏసియన్‌ గేమ్స్‌కు నేషనల్‌ లేజర్‌ ఛాంపియన్‌షిప్‌ ఈవెంట్‌ ట్రయిల్‌ లాంటిందన్నారు. ఈ పోటీల్లో 11క్లబ్‌లకు సంబంధించిన సెయిలర్స్‌ తమ పేర్లను నమోదు చేసుకున్నారని, 11 మంది మహిళలు, 17 మంది తెలంగాణ సెయిలర్స్‌ ఉన్నారని తెలిపారు. 72ఏండ్ల సెయిలర్‌ మురళికానూరి కూడా పోటీల్లో పాల్గొన్నారని చెప్పారు. ఈ పోటీలకు యాచింగ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(వైఏఐ) గుర్తింపు కూడా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్‌ సెయిలింగ్‌ క్లబ్‌ అధ్యక్షులు రఘురామ్‌రెడ్డి, మేజర్‌ జనరల్‌ అజరుశర్మ, అధికారులు పాల్గొన్నారు.