
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2022-23లో 2,167 ఇళ్లు మాత్రమే నిర్మించినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ మంగళవారం లోక్సభలో ఒకప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు. 2022-23లో 1,78,899 ఇళ్లు మంజూరు అయితే, అందులో కేవలం 2,167 ఇళ్లు మాత్రమే నిర్మాణం జరిగిందన్నారు. 2020-21లో 1,816 ఇళ్లు మంజూరైతే, ఒక్క ఇల్లు నిర్మాణం కూడా జరగలేదన్నారు. 2021-22లో ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదని తెలిపారు. పిఎంఎవై-జి కింద ఇప్పటి వరకు 2,46,435 ఇల్లు మంజూరు అయితే, 53,965 ఇల్లు నిర్మాణం పూర్తి అయిందని ఆ శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్వోతి మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
78 లక్షల మందికి 'ఉపాధి' తొలగింపు
ఆంధ్రప్రదేశ్లో తొలగించిన జాబ్ కార్డుల్లో 78,05,569 మంది ఉపాధి కార్మికులు ఉన్నారని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. లోక్సభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఏపిలో తొలగించిన జాబ్ కార్డుల్లో 2021-22లో 6,25,514 మంది ఉపాధి కార్మికులు ఉండగా, 2022-23లో తొలగించిన జాబ్ కార్డుల్లో 78,05,569 మంది ఉపాధి కార్మికులు ఉన్నారని తెలిపారు. తెలంగాణలో 2022-23లో తొలగించిన జాబ్ కార్డుల్లో 17,32,936 మంది ఉపాధి కార్మికులు ఉన్నారని తెలిపారు. దేశ వ్యాప్తంగా 2022-23లో తొలగించిన జాబ్ కార్డుల్లో 5,18,91,168 మంది ఉపాధి కార్మికులు ఉన్నారని తెలిపారు.
జెన్కోకి రూ.1,704 కోట్లు ఏపి డిస్కాంలు బకాయిలు
ఆంధ్రప్రదేశ్ జెన్కోకి నాలుగు డిస్కాంలు రూ.1,704 కోట్లు బకాయిలు పడ్డాయని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కె సింగ్ తెలిపారు. రాజ్యసభలో మంగళవారం ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జూలై 24 నాటికి ఏపి జెన్కోకి ఏపి సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ రూ.158 కోట్లు, ఏపి ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ రూ. 34 కోట్లు, ఏపి పవర్ పర్చేజ్ కోఆర్డినేషన్ కమిటీ రూ.1,127 కోట్లు, ఏపి సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ రూ.385 కోట్లు బకాయి పడ్డాయని తెలిపారు. తెలంగాణలో జూలై 24 నాటికి జెన్కోకి రెండు డిస్కాంలు రూ.1,165 కోట్లు బకాయిలు పడ్డాయని తెలిపారు.