Oct 31,2023 16:56

బ్యాంకాక్‌ :   పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు థాయ్ లాండ్‌  ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌, తైవాన్‌ నుండి వచ్చే పర్యాటకులకు ఉచిత వీసాలను కల్పిస్తున్నట్లు నిర్ణయించింది. నవంబర్‌ నుండి వచ్చే ఏడాది (2024) మే వరకూ ఈ ఉచిత వీసా పథకం అమలులో ఉంటుందని థాయ్ లాండ్‌  ప్రభుత్వం ప్రకటించింది. భారత్‌, తైవాన్‌ నుండి వచ్చే వారు వీసా లేకుండా 30 రోజులు థాయ్ లాండ్‌లో  పర్యటించవచ్చని తెలిపారు. మలేషియా, చైనా మరియు దక్షిణ కొరియా తర్వాత సుమారు 1.2 మిలియన్ల మంది పర్యాటకులతో ఈ ఏడాది భారత్‌ నాలుగవ స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో నిలిచిన చైనా పర్యాటకులకు ఇటీవల ఉచిత వీసా సౌకర్యాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. తాజాగా భారత్‌, తైవాన్‌లను అనుమతించింది.

ప్రభుత్వ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్‌ 29వ తేదీ వరకూ 22 మిలియన్ల మంది థాయ్ లాండ్‌ సందర్శనకు వెళ్లారు. దీని ద్వారా 927.5 బిలియన్‌ బాట్‌ (25.67 బిలియన్‌ డాలర్లు) ఆదాయం సమకూరింది.    ఇక ఈ ఏడాది 28   మిలియన్ల మంది పర్యాటకులను ఆకర్షించాలని      థాయ్ లాండ్‌     ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.