Apr 17,2023 22:03

ఫొటో : గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి

సంక్షేమ పథకాలతో వైసిపి గెలుపు
ప్రజాశక్తి - కావలి: ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ పథకాలే 2024లో రానున్న ఎన్నికల్లో వైసిపిని తప్పక గెలిపిస్తాయని ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన 3వ వార్డులో ''గడప గడపకు మన ప్రభుత్వం'' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి జగనన్న స్టిక్కర్‌లను అతికిస్తూ, సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేస్తూ, ప్రజలను పరామర్శ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత టిడిపి ప్రభుత్వంలో అభివృద్ధి పనులు చేయకుండానే శిలాఫలకాలకే పరిమితమయ్యారని, ప్రజలను మోసగించారని తెలిపారు. ఈ ప్రాంతంతో రోడ్డును వేయించేందుకు వెంటనే భూమిపూజ చేసి, పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
రంజాన్‌ సందర్భంగా ముస్లిం సోదరులకు మంగళవారం తన ఇంట ఇఫ్తార్‌ విందు ఇవ్వనున్నట్లు తెలిపారు. ముస్లిం సోదరులందరూ విచ్చేసి, విందును జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో 3వవార్డు వైసిపి ఇన్‌ఛార్జి మండలి కృష్ణారావు, షమీముల్లా, నాయబ్‌రసూల్‌, కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, కనుమర్లపూడి వెంకట నారాయణ, కేతిరెడ్డి జగదీష్‌రెడ్డి, కుందుర్తి శ్రీనివాసులు, కామయ్య, తదితరులు పాల్గొన్నారు.