ప్రజాశక్తి-నందిగామ : నందిగామ పట్టణాన్ని నందనవనంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ పేర్కొన్నారు.గురువారం నందిగామ పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయ ఆవరణలో రూ.14 లక్షల విలువతో సిసి -బిటి రోడ్లకు పూర్తిచేసిన ప్యాచ్ వర్క్ ల ఫోటో ఎగ్జిబిషన్ ను శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ప్రారంభించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంఎల్సి అరుణ్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నందిగామ నగర పంచాయతీ పరిధిలో వేసిన నాసిరకం రోడ్లన్ని గుంతలమయంగా మారి ప్రజలు ఇబ్బంది పడుతుండటంతో - ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు ఆదేశాలతో రూ.14 లక్షలతో 20 వార్డుల పరిధిలోని సి సి -బి టి రోడ్లకు మరమ్మత్తు పనులను చేపట్టడం జరిగిందని, నాడు రోడ్లు ఎలా ఉన్నాయో ఫోటో తీసి - మరమ్మతులు చేశాక రోడ్లు ఎలా ఉన్నాయో ఫోటో తీసి మరి ఫొటో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి విభాగంలోనూ నాడు-నేడు అమలు చేస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలలు -ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు - రోడ్లలో కూడా నాడు ఎలా ఉన్నాయి- మన ప్రభుత్వం వచ్చాక ఎలా ఉన్నాయో ప్రజలకు అభివృద్ధి చేసి కళ్లకు కట్టినట్లు చూపెట్టడం జరుగుతుందన్నారు. పట్టణాభివృద్ధిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందంజలో ఉందని - పట్టణ అభివృద్ధి లో భాగంగా నందిగామ నగర పంచాయతీ పరిధిలో మేజర్ డ్రైన్ లను నిర్మించడంతో పాటు - రోడ్డు విస్తరణ పనులు - ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు -హెల్త్ కేర్ సెంటర్ల ఏర్పాటు - ఓపెన్ జిమ్ లాంటి తదితర పనులను చేపట్టామన్నారు. అనంతరం 20 వార్డుల పరిధిలో ప్రజలకు ఇబ్బందిగా మారిన గుంతలను గుర్తించి వేగవంతంగా మరమ్మతులు చేసిన నగర పంచాయతీ సిబ్బందిని ఎమ్మెల్సీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ వైస్ చైర్మన్ మాడుగుల నాగరత్నమ్మ , కమిషనర్ డాక్టర్ జయరామ్, ఏఈ ఫణి శ్రీనివాస్ , కౌన్సిల్ మరియు కోఆప్షన్ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.










