న్యూఢిల్లీ : కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన రాజకీయ పార్టీల ప్రచార కార్యక్రమాలపై ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయాలనే అంశంపై భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) సోమవారం నాడు సమీక్షించనుంది. భౌతిక ప్రదర్శనలను అనుమతించాలా? లేదా వాటిపై నిషేదం విధించాలా అనే అంశంపైనా కూడా సమీక్షించనున్నట్లు ఇసిఐ ఆదివారం తెలిపింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూలు విడుదల చేసిన జనవరి 8నాటికి కోవిడ్ కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో భౌతిక ర్యాలీలు, రోడ్షోలపై ఎన్నికల సంఘం నిషేదం విధించింది. ఈ నెల 22న జరిగిన ఇసిఐ సమావేశంలో నిషేదాన్ని జనవరి 31 వరకూ పొడిగించింది. అయితే ఒకటి, రెండు దశల్లో పోలింగ్ జరగనున్న నియోజకవర్గాల్లో గరిష్టంగా 500 మందితో బహిరంగ సభలు నిర్వహించుకునేందుకు అనుమతించింది. ఇంటింటి ప్రచారానికి విధించిన షరతులను కూడా సడలించింది. ప్రస్తుతం కోవిడ్ పరిస్థితిని సమీక్షించి ఆ మేరకు ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు కూడా సడలింపులు ఇవ్వాలని ఇసిఐ యోచిస్తున్నట్లు తెలిసింది.










