Jan 26,2022 15:13

న్యూఢిల్లీ: 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్రమోడీ కొత్త వేషధారణతో కనిపించారు.   2014లో ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి ప్ర‌తి స్వాతంత్య్ర‌, గ‌ణతంత్ర‌ వేడుక‌లకు త‌ల‌పాగా, సంప్ర‌దాయ వ‌స్త్ర‌ధార‌ణ‌తో కనిపించేవారు.   ఈ గ‌ణ‌తంత్ర వేడుక‌ల్లో మాత్రం త‌ల‌పాగాకు స్వ‌స్తి... బ్ర‌హ్మ‌క‌మ‌లం చిత్రంతో ఉన్న‌ ఉత్తరాఖండ్ సంప్ర‌దాయ‌ టోపీని ధ‌రించారు.  ప్ర‌ధాని త‌న‌ మెడ‌పై వేసుకునే కండువా కూడా మార్చారు.  మ‌ణిపూర్ సంప్ర‌దాయానికి సంబంధించిన కండువాను ఆయ‌న ధ‌రించారు.  టోపీ ఉత్తరాఖండ్‌ సంప్రదాయానికి చిహ్నం. ఆ టోపీపై బ్రహ్మకమలం గుర్తు ఉంది. అది ఉత్తరాఖండ్ రాష్ట్ర పుష్పం.   కండువా మణిపూర్ సంస్కృతిని ప్రతిబింబిస్తోంది.  ఈ కండువా చేతితో నేసినది. ఇది మణిపూర్‌లోని మేటీ తెగ వినియోగించే ప్రత్యేక వస్త్రం. 

కాగా,  కొద్దిరోజుల్లో  జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరాఖండ్‌, మణిపూర్ రాష్ట్రాలు కూడా ఉన్నాయి.  ఈ సమయంలో ఆ రాష్ట్రాల సంస్కృతికి తగినట్టుగా మోడీ వస్త్రధారణ ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉత్తరాఖండ్‌లో ఫిబ్రవరి 14న, మణిపూర్‌లో ఫిబ్రవరి 27, మార్చి మూడో తేదీన ఎన్నికలు జరగనున్నాయి.  ఈ నేప‌థ్యంలో ప్రధాని వేషధారణ ఎన్నికల స్టంట్ అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.