ప్రజాశక్తి - విజయవాడ : ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు ప్రాధాన్యత భవన నిర్మాణాల పురోగతిని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలైన 268 గ్రామ సచివాలయాలు, 260 రైతు భరోసా కేంద్రాలు , 239 వైఎస్సార్ హెల్త్ క్లినిక్లు పనుల పురోగతిని సంబంధిత మండల ఇంజనీర్లతో సమీక్షిస్తూ నిర్దేశించిన గడువులోగా అన్ని ప్రాధాన్యత భవనాలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంజనీర్లతో పనుల పురోగతిని తెలుసుకొని నిర్దేశించిన లక్ష్యం మేరకు అన్ని ప్రాధాన్యత భవనాలను పూర్తిచేసి సంబంధిత శాఖల అధికారులకు అప్పగించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా భవనాల స్టేజ్ కన్వర్షన్ పనులు వెంట వెంటనే జరిగేలాగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు ఛాలెంజ్ గా తీసుకొని శాఖల సమన్వయంతో పూర్తిచేయాల న్నారు. నిర్మాణ పనులలో ఎదురయ్యే ఇబ్బందులను స్థానిక ప్రజాప్రతినిధుల దష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలన్నారు. పనుల పురోగతిపై సంబంధిత కాంట్రాక్టర్లతో ఎప్పటికప్పుడు సంప్రదించుకొని స్టేజ్ కన్వర్షన్ పూర్తిచేయాలన్నారు. తుది దశలో ఉన్న నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేసి అప్పగించాలని కలెక్టర్ ఢిల్లీరావు అధికారులను ఆదేశించారు. సమీక్ష సమావేశంలో పంచాయతీరాజ్ యస్.ఈ ఎ. వెంకటేశ్వరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజీనీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఉన్నారు.










