Nov 17,2023 11:09
  • ప్రజాసమస్యలపై పోరాడే తమ్మినేనికే ఓట్లు వేయండి

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో  : ఈ నెల 30న జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిజాయితీపరులకే పట్టం కట్టాలని, అనునిత్యం ప్రజా సమస్యలపై పోరాడే తమ్మినేనిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సిపిఎం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పూర్వ కార్యదర్శి, మాజీ ఎంపి పి మధు కోరారు. పాలేరు సిపిఎం అభ్యర్థి తమ్మినేని వీరభద్రం విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం రూరల్‌ మండలంలోని ఏదులాపురం గ్రామంలో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచరంలో ఆయన పాల్గొన్నారు. ఏదులాపురం, ఆదిత్యనగర్‌, ఓరుగంటి నగర్‌, వెంపటి నగర్‌, సింహాద్రి నగర్‌, మారుతీ నగర్‌, ఆటో నగర్‌, సాయి బృందావనం కాలనీల్లో రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గంలో బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులు బడా కాంట్రాక్టర్లు కావడంతో డబ్బు సంచులతో ప్రజలను ప్రలోభ పెట్టి గెలిచేందుకు వస్తున్నారని అన్నారు. అలాంటి వారి మాయమాటలను నమ్మి ప్రజలు మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. తమ్మినేని 50 ఏళ్ల నుంచి పట్టిన ఎర్ర జెండాను విడవని నిజాయితీపరుడని, అలాంటి వ్యక్తికి మీ అమూల్యమైన ఓటు వేయాలని కోరారు. సిపిఐ సోదరులు ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తోటి సోదర వామపక్ష రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని పాలేరు నుంచి పోటీ చేస్తున్నారని, మీ ఓట్లు ఆయనకు వేయాలని సిపిఐ శ్రేణులను కోరారు. సిపిఎం పాలేరు అభ్యర్థి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ వామపక్ష సోదరులు, అభ్యుదయవాదులు, లౌకిక శక్తులు సుత్తి కొడవలి నక్షత్రంపై ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తన విజయాన్ని కాంక్షిస్తూ ఈ నెల 25న ఎం వెంకటాయపాలెంలో జరిగే బహిరంగ సభకు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వస్తున్నారని, మండలంలోని వామపక్ష శక్తులు ఈ సభకు హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి బండి రమేష్‌, షేక్‌ బషీరుద్దీన్‌, మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్‌, మండల ఇన్‌చార్జి ఊరడి సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.