
ప్రజాశక్తి కలక్టరేట్ (కృష్ణా ) : పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా పోలీసు కార్యాలయ పోలీస్ మైదానంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ పి.జాషువా హాజరుఅయి విద్యార్థులతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తదుపరి విద్యార్థితో కలిసి ఎస్పీ శాంతి కపోతాలు ఎగరవేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రజల రక్షణ, ప్రజా శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పోలీస్ శాఖ విధి నిర్వహణ, వారు విధుల్లో ఉపయోగించే ఆయుధాలు, ఇతర పరికరాలు గూర్చి ప్రజలకు తెలుసుకోవాలని ఉచ్చుకత ఉంటుందన్నారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా అన్ని రకాల ఆయుధాలు వాటి పనితీరును ఓపెన్ హౌస్ కార్యక్రమం ద్వారా ప్రదర్శించడం జరుగుతుందని, వీటిని విద్యార్థులంతా ఎంతో ఉత్సాహంగా వినియోగించుకుంటున్నారని తెలిపారు. పోలీసులు వారి విధి నిర్వహణలో ఉపయోగించే వివిధ రకాల వాహనాలు, అన్నింటిని పరిశీలించారు. ఈ కార్యక్రమానికి మచిలీపట్నం పట్టణ పరిధిలోని వివిధ పాఠశాలల కళాశాల విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ప్రదర్శనకు ఉంచిన ఆయుధాలను తిలకించారు.