కృష్ణా (నూజివీడు) : కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటిలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటకు చెందిన టి.పరమేశ్వర జగన్నాథం (18) నూజివీడు ట్రిపుల్ ఐటిలో పియుసి రెండో సంవత్సరం చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం హాస్టల్లోని ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. తోటి విద్యార్థులు, సెక్యూరిటీ సిబ్బంది గమనించి అతడిని స్థానిక ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పరమేశ్వర జగన్నాథం మృతి చెందినట్లుగా నిర్ధారించారు. ఈ ఘటనపై నూజివీడు సిఐ నారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.










