Jan 07,2023 15:02

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్: శనివారం మండల పరిధిలోని ఊటుకూరులో రవి శేఖర్ రాజు అనే రైతుకు తన పొలంలో జాతీయ పక్షి నెమలి కదలని స్థితిలో కనిపించగా  అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. అటవీ శాఖ సిబ్బంది పంట పొలాల వద్దకు చేరుకుని వయసు పైబడి కదలలేని స్థితిలో ఉన్న నెమలిని ఊటుకూరు యువకులు హరికృష్ణ, అశోక్ ల సహాయంతో అటవీ శాఖ రేంజర్ నారాయణకు అప్పగించారు. వారు నెమలికి పంచనామా నిర్వహించి చికిత్స నిమిత్తం పశు వైద్యశాలకు తరలించారు. ఈ సందర్భంగా రేంజర్ నారాయణ మాట్లాడుతూ చికిత్స అనంతరం నెమలిని అటవీ ప్రాంతంలో వదలాల.. లేదా జంతు శాలకు తరలించాలా అన్నది ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు అమలు పరచడం జరుగుతుందని తెలియజేశారు.