ప్రజాశక్తి-కడప : అభివృద్ధిని విస్మరించి బటన్ నొక్కడమే సీఎం జగన్ పనిగా పెట్టుకున్నారని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గపూర్ విమర్శించారు. ప్రత్యామ్నాయ విధానాలపై నవంబర్ 10న విజయవాడలో ప్రజారక్షణ భేరి బహిరంగ సభ జరగనున్నట్లు తెలిపారు. శనివారం సిపిఎం కడప జిల్లాస్థాయి శిక్షణ తరగతులలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తెలిపారు. పరిశ్రమలు, ఉపాధి ఉద్యోగ అవకాశాలు, సాగునీటి ప్రాజెక్టులు గాలికి వదిలేసి బట్టన్ నొక్కడమే పనిగా ముఖ్యమంత్రి ఉన్నారని ఎంఏ గఫూర్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని వర్గాల ప్రజలపై పోటీపడి భారాలు వేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ భారాలకు వ్యతిరేకంగా రానున్న కాలంలో ప్రజా పోరాటాలకు శ్రీకారం చుడుతున్నామని ఆయన తెలిపారు.










