Nov 11,2023 22:39

- గుంతలమయమైన రోడ్లు - పట్టించుకోని అధికారులు

కుంటలను తలపిస్తున్న ఆర్‌ అండ్‌ బి రోడ్లు
- గుంతలమయమైన రోడ్లు - పట్టించుకోని అధికారులు
ప్రజాశక్తి- రామచంద్రపురం: మండలంలోని ఆర్‌అండ్‌ బి రహదారులలో ప్రయాణం చేయడం అంటే నరకయాతనేనని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో అనుపల్లి- రాయలచెరువు, కుప్పంబాదురు- పరమాల నెత్తకుప్పం - ఎల్‌వి.పురం, తిరుపతి - పచ్చికాపలం ప్రధాన రహదారులు మరమ్మతులకు నోచుకోక గుంతలమయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డుపై వర్షపునీరు నిలిచిపోవడంతో మండలంలో ఆర్‌ అండ్‌బి రోడు కుంటలు తలపించేలా ప్రజలకు దర్శనమిస్తున్నాయి. అయినా ఆర్‌అండ్‌ బి అధికారులు పట్టించుకోక పోవడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ రహదారుల్లో ప్రయాణించాలంటే ప్రాణాలు చేతుల్లో పెట్టుకుని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉందని పలు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. గత నాలుగున్నర సంవత్సరాలగా ఆర్‌అండ్‌ బి అధికారులు రోడ్లపై పడిన గుంతలు కూడా పూడ్చకపోవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ ప్రమాదాల వల్ల సుమారు 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మండలంలో సూరవారిపల్లి, తిమ్మరాజు పల్లి, నెత్తకుప్పం, వేపకుప్పం గ్రామాల వద్ద ఆర్‌ అండ్‌ బి రోడ్డుపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రహైవే అయిన తిరుపతి- పచ్చికాపలం ప్రధాన రహదారిపై కంకరు, మట్టి, ఇసుక లోడ్‌ టిప్పర్లు తిరగడం వల్ల రోడ్లు పూర్తిగా గుంతలమైపోయాయి. దీంతో అత్యవసర పనుల నిమిత్తం తిరుపతికి వెళ్లే వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఇకనైనా ఆర్‌ అండ్‌ బి అధికారులు స్పందించి రోడ్లను మరమ్మతు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.