
కరువు కనబడటం లేదా జగనన్నా..!!
ప్రజాశక్తి- శ్రీకాళహస్తి : ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడి, వ్యవసాయ రంగానికి మూలాధారమైన నీటి జాడ లేక రాష్ట్రం తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులలోకి నెట్టి వేయబడుతుంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కరువు కనబడటం లేదా..? అని టీడీపీ నాయకుల మిన్నల్ రవి, డాక్టర్ ఉమేష్ రావు శనివారం ప్రశ్నించారు. అటు ఖరీఫ్ సీజన్లో కానీ, ఇటు రబీ సీజన్లో కానీ ఎన్నడూ లేనంతగా అత్యంత కనిష్ట స్థాయిలో వర్షపాతం నమోదైన విషయాన్ని భారత వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నా కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వర్షాభావం కారణంగా నెలకొన్న కరువు ప్రాంతాల గుర్తించడంలో తీవ్రమైన నిర్లక్ష్యం చేయడం దారుణమైన విషయమని విమర్శించారు. రాష్ట్రంలో గత నలభై రోజులుగా సాధారణ సగటు వర్షపాతం ఉండాల్సి ఉండగా కేవలం 55 మి.మీ. మాత్రమే వర్షం పడటం కరువుకు నిదర్శనమన్నారు. కరువు మండలాలను గుర్తించడంలో అలసత్వం కారణంగా రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నదని, ఖరీఫ్, రబీ సీజన్లలో వర్షాభావం వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించే చర్యలు చేపట్టాలని ఉమేష్ డిమాండ్ చేశారు.