Jan 25,2022 13:45

న్యూఢిల్లీ :  2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావించే యుపి అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తి కరంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించకముందు ఎక్కడి నుండైనా పోటీకి సిద్ధమేనని ప్రకటించిన నేతలు.. ఇప్పుడు ఆయా పార్టీలకు విజయావకాశాలు అధికంగా ఉండే నియోజకవర్గాల నుండి బరిలోకి దిగుతున్నారు. దీనికోసం సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను సైతం పక్కనపెడుతున్నట్లు సమాచారం. గెలుపుకు ఎక్కువ అవకాశాలు ఉన్న నియోజకవర్గాల నుండి పోటీకి దిగితే.. పెద్దగా శ్రమపడాల్సిన అవసరం ఉండదని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
 

గోరఖ్‌పూర్‌ నుండి యోగి ..
యుపి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ తనకు, బిజెపికి పట్టు ఉన్న గోరఖ్‌పూర్‌ అర్భన్‌ నుండి బరిలోకి దిగుతున్నారు. జనసంఫ్‌ు కాలం నుండి ఈ నియోజకవర్గంలో బిజెపికి మంచి పట్టుంది. 1980, 1985ల్లో కాంగ్రెస్‌ నుండి పోటీకి దిగిన మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌శాస్త్రి కుమారుడు సునీల్‌ శాస్త్రి వరుసగా విజయం సాధించారు. అనంతరం ఒక్కసారి మినహా మిగిలిన ఏడుసార్లు బిజెపి గెలిచింది. 1989 నుంచి 1996 వరకు వరుసగా నాలుగుసార్లు బిజెపి అభ్యర్థి శివప్రతాప్‌ శుక్లా గెలిచారు. అయితే తర్వాత పరిస్థితులు మారిపోయాయి. స్థానిక గోరక్ష పీఠాధిపతి మహంత్‌ అవేధ్యనాథ్‌ ఉత్తరాధికారిగా ఉన్న యోగి 2002లో ఈ స్థానంలో పిల్లల డాక్టర్‌ రాధామోహన్‌దాస్‌ అగర్వాల్‌ను హిందూమహాసభ అభ్యర్థిగా పోటీలో నిలబెట్టడంతో శుక్లా ఓడిపోయారు. అనంతరం రాధామోహన్‌దాస్‌ అగర్వాల్‌ బిజెపిలో చేరారు. 2002 నుండి 2017 వరకు ఆయనే గెలిచారు. ఈసారి ఈ స్థానం నుండి యోగి పోటీకి సిద్ధమవుతున్నారు. అత్యధిక మెజార్టీ సాధించాలని భావిస్తున్నారు.
 

కర్‌హల్‌ నుండి అఖిలేష్‌ యాదవ్‌

సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పి) అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ మైన్‌పురి లోక్‌సభ పరిధిలోని కర్‌హల్‌ స్థానం నుండి పోటీకి దిగుతున్నారు. 1993కు ముందు సోషలిస్ట్‌ పార్టీ, లోక్‌దళ్‌, జనతాపార్టీ, జనతాదళ్‌ పార్టీల అభ్యర్థులు విజయం సాధించినా.. ఆ తర్వాత ఎస్‌పి ఖాతాలోకి వెళ్లింది. యాదవ వర్గం ఓటర్లు ఎక్కువ. ఇక్కడి నుండి బాబూరాం యాదవ్‌ అత్యధికంగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారి 1985లో లోక్‌దళ్‌ నుంచి, తర్వాత జనతాదళ్‌, జనతా పార్టీల తరఫున నెగ్గారు. 1993, 1996ల్లో ఎస్‌పి అభ్యర్థిగా గెలిచారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే సోబరన్‌ సింగ్‌ ఇక్కడ నాలుగుసార్లు గెలుపొందారు. 2002లో బిజెపి నుండి గెలుపొందిన ఆయన ఆ తర్వాత వరుసగా మూడు సార్లు ఎస్‌పి అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. సోబరన్‌ సింగ్‌ను పక్కన పెట్టి ఈ ఎన్నికల్లో అఖిలేష్‌ యాదవ్‌ పోటీకి దిగుతున్నారు.