Feb 07,2023 21:16

జొహన్నెస్‌బర్గ్‌: ఐసిసి మహిళల టి20 ప్రపంచకప్‌ గ్రూప్‌-2లో ఉన్న భారత్‌ సెమీస్‌కు చేరడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. భారతజట్టులో ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన రాణిస్తే టీమిండియా విజయం నల్లేరుమీద నడకే కానుంది. ఈ ఫార్మాట్‌లో పవర్‌ ప్లే ఓవర్లు ముగిసే వరకు ఓపెనర్లు వికెట్లు చేజార్చుకోకుండా క్రీజ్‌లో నిలబడితే పరుగుల వరద పారడం ఖాయం. వీరికి తోడు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌, మేఘన, రోడ్రిగ్స్‌, దీప్తి క్రీజ్‌లో కుదురుకుంటే చాలు. బౌలింగ్‌లో హర్లిన్‌, శిఖా, రేణుక, రాధాకి తోడు ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ స్పిన్‌లో సత్తా చాటాల్సి ఉంది. ఇక గ్రూప్‌-2లో భారత్‌తోపాటు టైటిల్‌ ఫేవరెట్‌ ఇంగ్లండ్‌ జట్టు మాత్రమే బలీయంగా ఉంది. ఇక పాకిస్తాన్‌, ఐర్లాండ్‌, వెస్టిండీస్‌ జట్లతో పోల్చిచూస్తే భారత్‌ దుర్భేద్యఫామ్‌లో ఉంది. వెస్టిండీస్‌ జట్టు గతంతో పోల్చిచూస్తే కొంత బలహీనంగా కనబడుతున్నా.. ఆ జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. 2016లో విండీస్‌ మహిళల జట్టు భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై సంచలన విజయం సాధించి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఇదే క్రమంలో గ్రూప్‌-1లో ఉన్న 5సార్లు టైటిల్‌ విజేత ఆస్ట్రేలియాతోపాటు, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా జట్లు బలమైన జట్లే. గ్రూప్‌ దశలో ప్రతి జట్టు తమ గ్రూప్‌లోని మిగిలిన నాలుగు జట్లతో ఒక్కోసారి తలపడిన అనంతరం అగ్రస్థానంలో నిలిచిన రెండేసి జట్లు సెమీస్‌కు చేరనున్నాయి. ఫిబ్రవరి 23, 24న సెమీఫైనల్స్‌, 26న ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది.
టి20 ప్రపంచకప్‌కు భారత మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(కెప్టెన్‌), హర్లిన్‌ డియోల్‌, జెమీమా రోడ్రిగ్స్‌, మేఘన, షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, దీప్తి శర్మ, దేవిక వైద్య, పూజ వస్త్రాకర్‌, స్నేV్‌ా రాణా, రీచా ఘోష్‌, యస్టికా భాటియా(వికెట్‌ కీపర్లు), అంజలి శర్వాణి, మేఘ్నా సింగ్‌, రాధా యాదవ్‌, రాజేశ్వరి గైక్వాడ్‌, రేణుకా సింగ్‌, శిఖా పాండే.