Jul 23,2021 11:10

కొండాపూర్‌ (హైదరాబాద్‌) : భార్యకు మూర్ఛరావడంతో భర్తకు గుండెపోటు వచ్చి బ్రెయిన్‌డెడ్‌ అయ్యి మృతి చెందిన విషాద ఘటన కొండాపూర్‌లో చోటుచేసుకుంది. శుక్రవారం పాఠశాల ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... కొండాపూర్‌ మండల పరిధి గంగారం ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా బి.ప్రవీణ్‌కుమార్‌ (47) గత ఆరు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. మూడు రోజుల క్రితం సంగారెడ్డిలోని తన నివాసంలో భార్య జ్యోతికి మూర్ఛరావడంతో మందులు తీసుకురావడానికి ప్రవీణ్‌ కుమార్‌ గదిలోకి వెళ్లారు. అక్కడే గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఇద్దరినీ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. భార్య ఆరోగ్యం కుదుటపడింది. ప్రవీణ్‌ కుమార్‌కు బ్రెయిన్‌డెడ్‌ అయినట్టు డాక్టర్లు చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. ఆయన అవయవాలను జీవన్‌దాన్‌ ట్రస్టుకు దానం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. ఈరోజు సంగారెడ్డిలో ఉపాధ్యాయుని భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.