షార్జా: కీలక మ్యాచ్లో బెంగళూర్ బ్యాట్స్మెన్ పెద్దగా రాణించలేకపోయారు. ఢిల్లీపై మ్యాచ్లో 20 ఓవర్లకు ఏడు వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రమే చేశారు. దేవద్త్ పడిక్కల్ 50 పరుగులు చేయగా, ఎబి డివిలియర్స్ 35 పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో నోర్జే మూడు వికెట్లు తీయగా, రబడ రెండు వికెట్లు తీశాడు.
మొదట టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ను ఎంచుకుంది. ఆర్సిబి తరపున ఓపెనర్లుగా దేవదూత్ పడిక్కల్, ఫిలిప్ వచ్చారు. మొదటి ఓవర్లో నాలుగు పరుగులే వచ్చాయి. రెండో ఓవర్ స్పిన్నర్ అశ్విన్ వేశాడు. ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. పడిక్కల్, ఫిలిప్ ఆచితూచి ఆడుతున్నారు. నాలుగు ఓవర్లకు బెంగళూర్ 25 పరుగులు చేసింది. ఆ తర్వాత ఓవర్లో రబడ వేసిన తొలిబంతికి షాట్కు ప్రయత్నించి ఫిలిప్ అవుటయ్యాడు. తర్వాత పడిక్కల్కు విరాట్ తోడయ్యాడు. ఆ తర్వాత కూడా పరుగులు నిదానంగానే వచ్చాయి. పవర్ప్లే ముగిసే సమయానికి ఆరు ఓవర్లకు ఒక వికెట్ కోల్పయి బెంగళూర్ 40 పరుగులు మాత్రమే చేయగలిగింది. పది ఓవర్లకు బెంగళూర్ ఒక వికెట్ నష్టానికి 60 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత పడిక్కల్, కోహ్లి రన్ రేట్ పెంచే ప్రయత్నం చేశారు. కానీ కోహ్లి 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్ బౌలింగ్లో స్టయినిస్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత పడిక్కల్కు ఎబి డివిలియర్స్ తోడయ్యాడు. ఇద్దరూ కలిసి రన్రేట్ను పెంచే ప్రయత్నం చేశాడు. ఈ లోపు పడిక్కల్ 41 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 15 ఓవర్లకు బెంగళూర్ రెండు వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. నోర్జే వేసిన 16 ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. మొదట పడిక్కల్ క్లీన్ బౌల్డ్ అవ్వగా, ఆ తర్వాత క్రిస్ మోరీస్ కీపర్ రిషబ్పంత్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. తర్వాత స్కోర్ బోర్డు పరిగెత్తించే క్రమంలో శివం దూబే, ఎబి డివిలయర్స్, ఉదాన అవుటయ్యారు. ఎబి డివిలిర్స్ ఒక ఫోర్, రెండు సిక్స్లతో 21 బంతులో 35 పరుగులు చేశాడు. 20 ఓవర్లు పూర్తయ్యే సరికి బెంగళూర్ ఏడు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.










