Nov 20,2023 23:16

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం, దేవరపల్లి టిడిపి అధినేత చంద్రబాబుకు హైకోర్టులో రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు కావడంతో టిడిపి శ్రేణులు రాజమహేంద్రవరంలో సోమవారం హర్షం వ్యక్తం చేశాయి. నగరంలోని ఆదెమ్మ దిబ్బ వాంబే గహాల వద్ద నుంచి భారీ ర్యాలీగా కంబాలచెరువు చిరంజీవి బస్టాండ్‌ వద్దకు చేరుకుని అక్కడ భారీగా టపాసులు పేల్చి మిఠాయి తినిపించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంఎల్‌సి ఆదిరెడ్డి అప్పారావు, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాేజకీయ కక్షతో పెట్టిన కేసులపై న్యాయం జరుగుతుందని భావించామని, ఆలస్యమైన అంతిమంగా న్యాయమే గెలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు షేక్‌ సుభాన్‌, కాశి నవీన్‌కుమార్‌, బుడ్డిగ రాధా, తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేయడం హర్షణీయమని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. స్రుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న క్వాష్‌ పిటిషన్‌ వ్యవహారంలో కూడా సానుకూలమైన తీర్పు వస్తుందన్న ఆశాభావాన్ని గన్ని వ్యక్తం చేశారు. దేవరపల్లిలో టిడిపి అధినేత చంద్రబాబుకు స్కిల్‌ స్కామ్‌ కేసులో హైకోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేయడంతో టిడిపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి మద్దిపాటి వెంకటరాజు, మాజీ ఎంఎల్‌ఎ ముప్పిడి వెంకటేశ్వరరావులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించిన వైసిపి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసిన ఏ ఒక్కటి కూడా రుజువు చేయలేక పోయాయని, కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటకు వచ్చారని అన్నారు. రానున్న రోజుల్లో ఆయనపై మోపిన అభియోగాలన్నీ కూడా రూపుమాపావుతాయన్నారు.