Jul 23,2021 15:32

హైదరాబాద్‌ : మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బిజెపికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరుకు పంపారు. ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడుతూ.. తన అనుభవాన్ని, సుదీర్ఘ రాజకీయ చరిత్రను దృష్టిలో పెట్టుకుని అయినా పార్టీలో సముచిత స్థానం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం బిజెపి కేంద్ర కమిటీలో ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడిగా కూడా అవకాశం ఇవ్వలేదన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను పార్టీలో చేర్చుకున్నపుడు తనకు ఒక్కమాట కూడా అడగకపోవడం ఇబ్బందికి గురిచేసిందన్నారు. సిఎం కెసిఆర్‌ నిర్వహించిన దళిత సాధికారత సమావేశంలో తన అభిప్రాయాలు తెలిజేయాల్సిందిగా ఆహ్వానిస్తే.. బండి సంజరుకు చెప్పే వెళ్లానని, అయినా పార్టీలో భిన్నాభిప్రాయాలు రావడం తనను బాధించిందని అన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బిజెపికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సిఎం కెసిఆర్‌ మీద విశ్వాసంతోనే బిజెపికి రాజీనామా చేసినట్లు చెప్పారు. దళితబంధు సఫలీకృతం కావాలని మోత్కుపల్లి ఆకాంక్షించారు. రాష్ట్రంలో టిడిపి లేదని, తన పాత మిత్రులంతా టిఆర్‌ఎస్‌కు మద్దతు పలకాలని కోరారు. దీన్ని బట్టి చూస్తే మోత్కుపల్లి త్వరలోనే టిఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.