
- దాడి చేసిందెవరో నరసరావుపేట ప్రజలందరికీ తెలుసు
- ఎమ్మెల్యే ఆగడాలు డీజీపీకి కనిపించడం లేదా?
ప్రజాశక్తి-నరసరావుపేట : దాడి చేసిన వైసీపీ ఎమ్మెల్యేని వదిలేసి బాధితులపై హత్యాయత్నం కేసులు పెట్టడం దుర్మార్గం, అప్రజాస్వామికమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆగ్రహించారు. అభివృద్ధికి మారుపేరైన నరసరావుపేటను అరాచకాలకు అడ్డాగా మార్చారని దుయ్యబట్టారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. పట్టపగలే దాడులు, విధ్వంసాలతో బీభత్సం సృష్టించిన వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసుల రెడ్డిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా బాధితులైన డాక్టర్ అరవింద్ బాబు, పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం వైసీపీ దిగజారుడు చర్యలకు నిదర్శనమని తెలిపారు. డీజీపీ దృష్టిలో బాధితులే నిందితులా? పోలీసు వ్యవస్థను వైసీపీ నేతల జేబు సంస్థగా వాడుకుంటున్నారని విమర్శించారు. కళ్లు మూసుకుని విధులు నిర్వహిస్తున్నారా? రౌడీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు ఈ ఘటన అద్దం పడుతోందన్నారు. ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తూ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆధ్వర్యంలో వందల మంది రౌడీ మూకను తీసుకుని టీడీపీ నేతల ఇళ్లపై దాడులకు దిగడం వాస్తవం కాదా? ఎవరి ఇళ్లపై ఎవరు దాడి చేశారో, ఎవరిని ఎవరు హత్య చేయదలిచారో కూడా తెలియని దుస్థితిలో పోలీసులు ఉన్నారా? అని ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకులు ఏం చెబితే అది చేయడం తప్ప.. చట్టాన్ని కనీసం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. నాలుగేళ్లుగా దాడులు దౌర్జన్యాలతో రాష్ట్రాన్ని రక్తసిక్తం చేసిన అధికార పార్టీ నేతలకు పోలీసులు అండగా నిలుస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని తెలిపారు. తక్షణమే నరసరావుపేట ఘటనలో అసలు నిందితులపై చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.