
అసమానతలు లేని అభివృద్ధి కోసం పోరాటం
ఎర్రజెండా ప్రజారక్షణ భేరి
ప్రజాశక్తి- తిరుపతి సిటి: దేశంలోనూ, రాష్ట్రంలోనూ రానురాను పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి. ప్రజాస్వామ్యమన్నది కనుమరుగువుతోంది. లౌకికవాదాన్ని మరిచిపోయారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు, కార్మికులు, కర్షకులు, ఆడ, మగ, వృద్దులు, పిల్లలు ఒకరేమిటి ప్రతి ఒకరు సమస్యల వలయంలో పడిలేస్తున్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి.. ధనవంతులకు పాలకులు తొత్తులుగా మారారు. దేశ సంపద మొత్తాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అప్పగించేస్తూ, ప్రభుత్వరంగ సంస్థలన్నిటిని నిర్వీర్యం చేస్తూ, దేశాన్ని అదోగతిపాలు చేస్తున్న విషయం జగమెరిగిన సత్యం. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు, నిలదీసిన వారికి అరెస్టులు, ప్రభుత్వ సంస్థలైన ఈడీలు, సిఐడి, సిబిఐ అన్ని పాలకుల చేతుల్లో బొమ్మలుగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవ్వరో వచ్చి మనల్ని ఉద్దరిస్తారని చూసే కన్నా, మన బతుకులను, రాష్ట్ర, దేశ భవిష్యత్తును సక్రమ మార్గాన నడిపించేందుకు ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించాల్సిన కాలం వచ్చింది. అందర్ని ఐక్యం చేసేందుకు ఎర్రజెండా కదలింది. ప్రజారక్షణ భేరితో కదం తొక్కుతోంది. రాష్ట్రంలోనూ అదేపరిస్థితి.
రాష్ట్రాన్ని విడగొట్టి పదేళ్లు పూర్తి కావకస్తోంది. అప్పడు మనకు అరచేతిలో స్వర్గం చూపించారు. కేంద్రంలోని బిజెపి నాయకులు. ప్రత్యేక హోదా, పోలవరం జాతీయ ప్రాజెక్టు, కడప ఉక్కుప్యాక్టరీ, రామాయపట్నం మేజర్ పోర్టు, రాజదాని నిర్మాణం, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, కేంద్ర విద్యాసంస్థల ఏర్పాటు, రైల్వేజోన్ వంటి విభజన హామీలలో ఏ ఒక్కటీ ఇప్పటి వరకు అమలు కాలేదు. రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిన బిజెపి ప్రభుత్వం అంతటిదో ఆగకుండా రాష్ట్ర పారిశ్రామిక అబివృద్ధికి గుండెకాయ లాంటి విశాఖ ఉక్కును తెగనమ్మడానికి తయారు కావడం గమనార్హం. బిజెపి పాలనలో దేశమే అస్తవ్యస్తంగా తయారైంది. బిజెపి బుల్డోజర్ రాజకీయాలతో అన్నదమ్ముల్లా మెలగాల్సిన ప్రజల మధ్య విద్వేషాలు రాజేస్తోంది. బిజెపి పాలిత ప్రాంతాల్లో మైనార్టీలకు రక్షణ కరువైంది. స్త్రీలను నడిరోడ్డు మీద నగం ఊరేగించి, సిగ్గులేకుండా అదేదో తమ ఘనత అన్నట్టు విర్రవీగుతున్నవారిని మోడీ ప్రభుత్వం సమర్ధిస్తుండడం శోచనీయం. కోట్లాది మంది కార్మికుల హక్కులను కాలరాసే లేబర్ కోడ్లను తెచ్చింది. దేశీయ వ్యవసాయానికి, ప్రజల ఆహార భద్రతకు ముప్పు తెచ్చే నల్ల వ్యవసాయ చట్టాలను తెచ్చింది. రైతుల పోరాటంతో వాటిని రద్దు చేసింది. అర్దాకలితో బతుకుతన్న వారు ప్రపంచంలోకెల్లా దేశంలోనే అధికంగా ఉన్నారంటే పరిస్థితి అర్ధమవుతోంది. నిరుద్యోగం రికార్డుస్థాయిలో పెరిగిపోతోంది. ధరల పెరుగదలో సామాన్యుడి నడ్డి విరుగుతున్నా మోడీ ప్రభుత్వం మాత్రం భారత్ అబివృద్ధిలో ముందుకు పోతోంది అంటూ పచ్చి అబద్దాలను వల్లవేస్తోంది. రాష్ట్రంలోనూ పరిస్థితి అలానే తయారైంది. కృష్ణపట్టణం, గంగవరం మేజర్ పోర్టులను ఆదానికి నైవేద్యంగా అప్పగిస్తున్నారు. విద్యుత్ ఛార్జీలు చాపకింద నీరులా పెంచేశారు. స్మార్ట్మీటర్ల, మోటర్లకు మీటర్ల పేరుతో, ఆస్తి పన్ను నుంచి చెత్తపన్ను దాకా అన్ని వడ్డింపులతో ప్రజలపై భారాలు మోపుతున్నారు. సిఎంకు నవరత్నాలు తప్పా పెరిగిన ధరలు, నిరుద్యోగం, గిట్టుబాటు లేని వ్యవసాయం, రక్షణ కరువైన చేతివృత్తులు, కౌలురైతులు ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదు. పైగా కరెంట్ చార్జీలు, ఇసుక ధరలు ప్రభుత్వమే పెంచింది. ఉపాధిని దెబ్బతీస్తున్నారు. చిన్న పరిశ్రమలు మూతబడ్డాయి. వైసిపి పాలనలో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారు. నిరసన కూడా తెలియజేయడానికి కూడా వీలు లేకుండా నిర్భందాలు, ముందస్తు అరెస్టులు, బైండోవర్ కేసులు బనాయిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం టిడిపి కూడా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనడం లేదు. పైగా వారిని పార్లమెంట్లో బలపరుస్తోంది. రాష్ట్రంలోని పోర్టులన్ని ఆదాని పరం చేసినా, విద్యుత్ ఛార్జీలు పెంచినా, ఉద్యోగుల పెన్షన్కి ఎసరు పెట్టినా, చంద్రబాబు నోరు విప్పడం లేదు. ఇక జనసేన పార్టీపరిస్థితి మరీ అన్యాయంగా తయరైంది. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపి కూటమిలో ఉంటూ మోడీ నాయకత్వాన్ని సమర్థిస్తూ మన రాష్ట్రానికి ఏ విధంగా న్యాయం చేయగలదో ఆ పార్టీ నాయకత్వానికే తెలియాలి. ఈ విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను, రాష్ట్రాన్ని పూర్తిగా గాలికొదిలేశాయి. ప్రధాన పార్టీలు తమలో తాము అధికారం కోసం కుస్తీలు పడుతున్నాయి. ప్రమాదంలో పడిన మన రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోలన్నా, సామాన్య ప్రజలకు నిజమైన ఊరట లభించాలన్నా ప్రజలే ఐక్యంగా కదలాలి. అప్పడే ప్రత్యేక హోదాను సాధించగలం. విశాఖ ఉక్కును కాపాడుకోగలం. విభజన హామీలు అమలు జరిగేటట్టు చూడగలం. అందుకు ఎర్రజెండా నడుంబిగించింది.
గతాన్ని ఒకసారి గమనం చేసుకుంటే విశాఖ ఉక్కు సాధన కోసం ఎన్టిఆర్ ప్రభుత్వాన్ని అక్రమంగా రద్దు చేసినప్పడు, ప్రజాస్వామ్మాన్ని పరిరక్షించడం కోసం, చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంచినప్పడు బషీర్బాగ్ పోరాటంలో తెలుగవాడి సత్తా ఏమిటో చూపించాం. ఇప్పడు అలాంటి మరోమహా ఉద్యమం అవసరం. అందుకే ప్రజారక్షణ భేరి. సిపిఎం ప్రజలను చైతన్యం చేస్తూ రాష్ట్ర్ర వ్యాప్తంగా బస్సుయాత్ర పేరుతో ప్రజారక్షణ భేరిని మ్రోగించింది. నాలుగు బృందాలుగా విడిపోయి ఈ బసుస యాత్ర రాష్ట్ర నలుమూలల పర్యటిస్తోంది. అందులో భాగంగా గత వారం ఈ యాత్ర మూడురోజుల పాటు తిరుపతి జిల్లాలో సైతం సాగింది. ఈ యాత్ర నవంబరు 15వ తేదీకి విజయవాడకు చేరుకుంటాయి. అదేరోజు భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలందరూ ఈ సభకు తరలివచ్చి ప్రజావ్యతిరేక ప్రభుత్వాలకు తగిన విధంగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.